- జీవీకే హెల్త్ హబ్లో వినూత్న కార్యక్రమం
- ఇప్పటికే అధిగమించిన వారితో మాటామంతీ
- తొలుత రెండు గంటలు డయాబెటిస్ వాక్
హైదరాబాద్: అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం, బాలల దినోత్సవం సందర్భంగా జీవీకే హెల్త్ హబ్లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చిన్నతనం నుంచి టైప్-1 మధుమేహం ఉండి, దాన్ని విజయవంతంగా అధిగమిస్తూ ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అయిన కొంతమంది.. ఇప్పుడిప్పుడే దాని గురించి తెలిసి ఇబ్బంది పడుతున్న పిల్లలకు అవగాహన కల్పించారు. నాలుగైదేళ్ల వయసులో టైప్-1 మధుమేహం ఉండి, ఏం తినాలో ఏం తినకూడదో కూడా సరిగా తెలియని పిల్లలకు.. తాము ఇన్నాళ్ల నుంచి ఎలా దాన్ని అధిగమిస్తున్నామన్న విషయాన్ని సమగ్రంగా వివరించారు.


అంతకుముందు ఉదయం 6.30 గంటలకు కేబీఆర్ పార్కు నుంచి మొదలుపెట్టి 8.30కి జీవీకే హెల్త్ హబ్ వరకు డయాబెటిస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీకే డయాబెటిస్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.జి. శాస్త్రి మాట్లాడుతూ, ‘‘మధుమేహం వల్ల రక్తనాళాలు ప్రభావితం అవుతున్నాయి. దానివల్ల చిన్నవయసులోనే గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి. మన దేశం మధుమేహం విషయంలో ప్రపంచ రాజధానిగా ఉంది. అందువల్ల అందరికీ ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించేందుకే డయాబెటిస్ వాక్ నిర్వహించాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా టైప్-1 మధుమేహానికి ఉచిత చికిత్స అందించడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివ, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దీపిక, ఇంకా పెద్ద సంఖ్యలో వైద్యులు, ఆస్పత్రి సీఓఓ జె.సుమన్ రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



