గ్రూప్‌–1కు తొలగిన అడ్డంకులు | Green signal for Group 1 job recruitment process: Supreme Court | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1కు తొలగిన అడ్డంకులు

Dec 7 2024 6:12 AM | Updated on Dec 7 2024 6:12 AM

Green signal for Group 1 job recruitment process: Supreme Court

నోటిఫికేషన్‌ రద్దు కుదరదన్న సుప్రీంకోర్టు 

మెయిన్స్‌ పరీక్షల రద్దు కూడా అవసరం లేదని స్పషీ్టకరణ 

పరీక్షల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకుంటే నియామకాలు నిలిచిపోతాయని వ్యాఖ్య 

ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌

త్వరలో మెయిన్స్‌ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ:  గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్‌–1 రీనోటిఫికేషన్, భర్తీ ప్రక్రియ, ప్రశ్నపత్రాల కీ తదితర అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కాలేదని, మెయిన్స్‌ పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్‌ పమిడిఘటం శ్రీ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అవసరం లేదని, దీనివల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని తేలి్చచెప్పింది. మెయిన్స్‌ పరీక్షలను రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచి్చంది. తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది.  

మెయిన్స్‌ ఫలితాల విడుదలే తరువాయి 
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్‌లో ప్రిలిమ్స్‌ నిర్వహించిన కమిషన్‌ అక్టోబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను కూడా నిర్వహించింది. అయితే గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పాటు మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో జీఓ 55కు బదులుగా జీఓ 29ని తీసుకురావడం, అదేవిధంగా ప్రిలిమ్స్‌ పరీక్షలకు సంబంధించి ప్రశ్నలకు జవాబులు, ‘కీ’లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ పరీక్షలు రాసిన పలువురు అభ్యర్థుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనే ఆందోళన నెలకొంది. తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీంకోర్టులో, అంతకుముందు హైకోర్టులో గ్రూప్‌–1పై ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల విచారణ పూర్తికావడంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లేనని టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఉద్యోగాల భర్తీ దాదాపు కొలిక్కిరానుంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగు తోంది. ఇందుకోసం కమిషన్‌ ప్రత్యేకంగా ప్రొఫెసర్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement