కీలకాంశాలపై వాడీవేడిగా | Godavari River Board Meeting Held in jalasoudha Hyderabad | Sakshi
Sakshi News home page

కీలకాంశాలపై వాడీవేడిగా

Jan 3 2023 1:25 AM | Updated on Jan 3 2023 1:25 AM

Godavari River Board Meeting Held in jalasoudha Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న కడెం–గూడెం ఎత్తిపోతల పథకం, మొడికుంటవాగు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతుల జారీ/అబ్జర్వేషన్ల నమోదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్ర కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

వాడీవేడి చర్చకు అవకాశం!
కడెం–గూడెం ప్రాజెక్టుపై ఏపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదని గత ఏడాది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం గోదావరి బో ర్డుకు లేఖ రాసింది.

అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో 3 టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినందున ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్టు ఇటీవల తెలంగాణ అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు పెద్దవాగు ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకో వడం వల్ల అత్యవసర మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. రూ.7,826 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు తెలంగాణ 2019లో ప్రతిపాదనలు సమర్పించింది. ఆయకట్టు శాతం ఆధారంగా ఏపీ 85.75 శాతం, తెలంగాణ 14.75 శాతం వ్యయం భరించాలని తెలంగాణ కోరగా, ఏపీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇదే దామాషా లెక్కన రూ.92 కోట్లతో అత్యవసర మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకరించింది. ఆధునీకరణతో పాటు అత్యవసర మరమ్మతులపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

నీటి లభ్యత ఎంత ?
గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటివరకు నిర్ణయించక పోవడంతో రెండు రాష్ట్రా ల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల జారీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదావరి నీటి పంప కాలపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. 1980లో వచ్చిన గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డులోకూడా నీటి లభ్యతపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

అయితే గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3,216 టీఎంసీల జలాల లభ్య త ఉండగా, అందులో ఉమ్మడి రాష్ట్రానికి కేవలం 1,360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్‌ అధ్య యనంలో తేలిందని ఏపీ వాదిస్తోంది. తెలంగాణకు 1,480 టీఎంసీలు, ఏపీకి 1,486.155 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంటోంది. ఈ నేప థ్యంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ స్థాయి సంస్థతో అధ్యయనం చేయించాలని గోదా వరి బోర్డు ప్రతిపాదించింది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement