మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత | Former MP Manda Jagannadham Passed Away | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

Jan 12 2025 9:30 PM | Updated on Jan 13 2025 1:26 AM

Former MP Manda Jagannadham Passed Away

సాక్షి, హైదరాబాద్‌/అలంపూర్‌: నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ డాక్టర్‌ మందా జగన్నాథం (74) అనా రోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.

1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్‌పీలో చేరారు. 

సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం ఎంపీగా ప్రజలకు సేవలందించిన జగన్నాథం మృతి బాధాకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement