పసుపు.. ఈసారి పసిడి పంటే | Farmers rejoice over affordable price of turmeric | Sakshi
Sakshi News home page

పసుపు.. ఈసారి పసిడి పంటే

Mar 7 2025 5:20 AM | Updated on Mar 7 2025 5:20 AM

Farmers rejoice over affordable price of turmeric

గతేడాదితో పోలిస్తే పెరిగిన సాగు.. దిగుబడి కూడా  

నిజామాబాద్‌ మార్కెట్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5,00,985 క్వింటాళ్లు రాక 

సీజన్‌ ముగిసేలోగా మరో 3.65 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా 

గత ఏడాదితో పోలిస్తే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా వచ్చే అవకాశం 

గిట్టుబాటు ధరతో రైతుల్లో హర్షం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపు పండించిన రైతులకు ధర గిట్టుబాటు అవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం పెరిగింది. అతివృష్టి లేకపోవడంతో దుంపకుళ్లు తెగులు (నీరు నిలిస్తే వచ్చే తెగులు) రాలేదు. దీంతో దిగుబడి సైతం గత ఏడాది కంటే ఎక్కువగా వస్తోంది. రాష్ట్రంలో పండించిన పసుపు పంటలో 80 శాతం నిజామాబాద్‌ మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటివరకు ఫింగర్‌ పసుపు రకానికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 13,311 ధర పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.11,300 ధర దక్కుతోంది. 

గోళా పసుపునకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.10 వేలు పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.9,900 దక్కుతోంది. ఫింగర్‌ పసుపునకు కనీస ధర రూ.10 వేలు, గోళా పసుపునకు కనీస ధర రూ.9వేలు తగ్గకుండా నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చొరవ తీసుకుంది. ప్రస్తుతం 15 నుంచి 20 శాతం తేమ ఉంటోందని, రైతులు తేమ శాతాన్ని 12 శాతానికి పరిమితం చేసుకుంటే మరింత ధర దక్కుతుందని మార్కెట్‌ కమిటీ చెబుతోంది.  

తగ్గుతూ వచ్చి.. మళ్లీ పెరుగుదల దిశగా.. 
నిజామాబాద్‌ మార్కెట్‌కు ఈసారి ఎక్కువగా పసుపు రానున్నట్టు అధికారులు చెబుతున్నా రు. 2019–20లో 10,78,821 క్వింటాళ్లు, 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021 –22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చింది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్‌ ప్రారంభమైంది. 

ఇప్పటి వరకు 5,00,985 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చింది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసు పు రానుందని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 2.25 లక్షల క్వింటాళ్లు, ఏప్రిల్‌లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్లు పసుపు ఇక్కడి మార్కెట్‌కు వస్తుందని అధికారుల అంచనా. మొత్తంగా మరో 3.65 లక్షల క్వింటాళ్లు రానున్నట్టు లెక్కలు వేస్తున్నారు. 

గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా ఇందులో 19 వేల ఎకరాలు నిజామాబాద్‌ జిల్లా రైతులు సాగు చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాలు సాగు చేయగా, ఇందులో నిజామాబాద్‌ జిల్లా రైతులు 22 వేల ఎకరాలు పసుపు సాగు చేశారు. 

నిరంతర పర్యవేక్షణ  
పసుపు రైతులకు మేలు చేసేవిధంగా పసుపు ట్రేడింగ్‌ విషయమై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్వింటాల్‌కు రూ.10 వేల ధర తగ్గకుండా కటాఫ్‌ పెట్టాం. ఈ–నామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ విషయమై పక్కాగా వ్యవహరిస్తున్నాం. రైతులు 12 శాతం కంటే ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి. తద్వారా ట్రేడర్లు తక్కువ ధరకు కోట్‌ చేయకుండా చూస్తాం.  – ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement