హైద‌రాబాద్‌లో ఘ‌ర్ష‌ణ‌: గ‌ణేశుడి విగ్ర‌హం ధ్వంసం? | Fact Check: Fight Between Two Hindu groups In Hyderabad | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్‌లో గ‌ణేశుడి ప్ర‌తిష్ట‌ను అడ్డుకున్నారా?

Aug 24 2020 8:52 PM | Updated on Aug 24 2020 9:30 PM

Fact Check: Fight Between Two Hindu groups In Hyderabad - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: క‌రోనా ప్ర‌భావం ఈసారి వినాయ‌క చ‌వితి మీద బాగానే ప‌డింది. గ‌ళ్లీకో రూపంలో ద‌ర్శ‌న‌మిచ్చే గ‌ణ‌ప‌య్య ఇప్పుడు ఊరంతా వెతికినా క‌నిపించ‌ని ప‌రిస్థితిలో ఉన్నాడు. అయితే హైద‌రాబాద్‌లో గ‌ణేశుడిని ప్ర‌తిష్టాపించే క్ర‌మంలో ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ‌వినాయ‌కుని విగ్ర‌హం ముందే రెండు గ్రూపులవారు ఒక‌రినొక‌రు త‌న్నుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు వారించిన‌ప్ప‌టికీ ఎవ‌రూ వినిపించుకునే ప‌రిస్థితిలోనే లేరు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. అయితే గ‌ణేశుడిని ప్ర‌తిష్టించ‌డం కొంద‌రికి ఇష్టం లేదని, దీంతో హిందూ వ్య‌తిరేక శ‌క్తులు గొడ‌వ‌కు దిగాయంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌తిమ‌ను కూడా ధ్వంసం చేశార‌ని ఆరోపించారు. ఇది నిజ‌మేన‌ని న‌మ్మిన నెటిజ‌న్లు ఆ ఇరు వ‌ర్గాల‌ను హిందూ, ముస్లింలుగా భావిస్తూ, ఈ ఘ‌ర్ష‌ణ‌కు మ‌తం రంగు పులుముతున్నారు. కానీ వాస్త‌వాల‌ను ప‌రిశీలిస్తే ఈ ప్ర‌చారంలో నిజం లేద‌ని తేలింది. ఈ గొడ‌వ‌కు ముస్లిం వ్య‌క్తులకు సంబంధ‌మే లేద‌ని నిర్ధార‌ణ అయింది. (ఏనుగు అతడిపైకి ఎలా వచ్చిందో చూడండి)

అస‌లేం జ‌రిగిందంటే.. మొఘ‌ల్‌పుర‌లోని బాల‌గంజ్ ప్రాంతంలో 20 ఏళ్లుగా ప్ర‌భుత్వ భూమిలోనే గ‌ణ‌ప‌య్య‌ను ప్ర‌తిష్టించి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఆ మండ‌పానికి స‌మీపంలోని భూమిని ఓ వ్య‌క్తి కొనుగోలు చేసి నివాస‌మేర్ప‌రుచుకున్నారు. ఇంటి ముందే ఉండే మండ‌పంలో జ‌రిగే వేడుక‌ల వ‌ల్ల త‌మ కుటుంబ గోప‌త్య‌ దెబ్బ తింటోంద‌ని ఆయ‌న స్థానిక అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని నెల‌ల క్రితం వాళ్లు అక్క‌డ మండ‌పాన్ని తీసివేశారు. ఇదిలా వుండ‌గా తాజాగా వినాయ‌క చ‌వితి రోజు ఎప్ప‌టిలాగే విగ్ర‌హాన్ని తీసుకుని ఆ మండ‌పం ప్రాంతానికి చేరుకోగా స‌ద‌రు వ్య‌క్తి, ఆయ‌న కుటుంబం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వ‌ర్గాల‌ మ‌ధ్య గొడ‌వ రాజుకుందని ఓ పోలీసు తెలిపారు. అంతేకాక గ‌ణేశుడి విగ్ర‌హం దారి మ‌ధ్య‌లోనే విరిగిపోయిన‌ట్లు బాలాగంజ్ ఆల‌య క‌మిటీ స‌భ్యుడు జిత్తూ తెలిపారు. (ఆ దెయ్యం బొమ్మ తిరిగి వ‌చ్చేసిందా?)

వాస్త‌వం: హైద‌రాబాద్‌లోని మొఘ‌ల్‌పుర‌లో వినాయ‌క చ‌వితి నాడు జ‌రిగిన ఘ‌ర్ష‌ణ హిందువుల‌కు మ‌ధ్యే జ‌రిగింది.

Advertisement
 
Advertisement
Advertisement