దేశంలోకెల్లా ‘ఇంటి’కి రూ.5 లక్షల ఘనత మాదే | Deputy CM Bhatti in review of Indiramma Housing Scheme | Sakshi
Sakshi News home page

దేశంలోకెల్లా ‘ఇంటి’కి రూ.5 లక్షల ఘనత మాదే

May 30 2025 6:00 AM | Updated on May 30 2025 6:00 AM

Deputy CM Bhatti in review of Indiramma Housing Scheme

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. పక్కన మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల

అనర్హులకు ఇళ్లు మంజూరైతే గెజిటెడ్‌ అధికారులపై చర్యలు 

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి 

పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి,పొంగులేటి, తుమ్మల

ఖమ్మం సహకారనగర్‌: దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలపై గురువారం డిప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. 

ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, వ్యవసాయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ. 22,500కోట్లు మంజూరు చేశామని.. ఏకకాలంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అనర్హులు ఉన్నట్లు తేలితే బాధ్యులైన గెజిటెడ్‌ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వానాకాలం సీజన్‌ వచ్చినందున నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా చర్యలు చేపట్టడంతోపాటు ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని భట్టి సూచించారు. సాదాబైనామా దరఖాస్తుల్లో కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి ఉన్న వాటిని తక్షణమే తిరస్కరించాలన్నారు. కోర్టు స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. 

వచ్చే నెల 3 నుంచి 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్‌ ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్‌ వి.పాటిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గించాలి: కూనంనేని 
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. తద్వారా అర్హులెవరికీ అన్యాయం జరగదన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూనే ఇందిరమ్మ కమిటీలు, అధికారుల పనితీరు పారదర్శకంగా ఉండేలా చూడాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. దివంగత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాం తర్వాత ఇప్పుడే ఇళ్లు మంజూరు చేస్తున్నందున అర్హులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఇసుక కొరత లేకుండా పర్యవేక్షించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement