రంగారెడ్డి జిల్లా: బిర్యానీ తినాలనే కోరిక ఆ కుటుంబంలో విషాదం నింపింది. బిర్యానీ అయిపోయిందని స్టౌను ఆఫ్ చేయకముందే రెగ్యులేటర్ను తొలగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాలకు గురి కాగా ఆమెను కాపాడేందుకు వెళ్లిన కూతురు, కుమారుడు కూడా గాయపడ్డారు. రాజేంద్రనగర్ పోలీసు సమాచారం మేరకు... ఉప్పర్పల్లిలో హరి సింగ్ కుటుంబ నివసిస్తుంది. ఇతని కూతురు మాధవి ఠాకూర్(55) తన కుమారుడు, కుమార్తెతో కలిసి తండ్రి వద్దే ఉంటుంది. ఆదివారం మాధవి ఠాకూర్ ఇంట్లో బిర్యానీ చేసేందుకు స్టౌను వెలిగించి బిర్యానీ పూర్తి చేసింది.
బిర్యానీ పూర్తయిన అనంతరం స్టౌను ఆఫ్ చేయకముందే రెగ్యులేటర్ను తీసి మరో స్టౌకు పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో మాధవి ఠాకూర్ తీవ్ర గాయాలకు గురైంది. వంట గదిలోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. మాధవి ఠాకూర్ను కాపాడేందుకు ప్రయత్నించిన కూతురు, కుమారుడు సైతం స్వల్ప గాయాలకు గురయ్యారు. తీవ్ర గాయాలకు గురైన మాధవి ఠాకూర్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


