కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ
ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సీపీఐరాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు
ఆదిలాబాద్: కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా శనివారం జోడేఘాట్ నుంచి సీపీఐ బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతాను కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఐ ఉద్యమిస్తున్నదని, ముఖ్యంగా నిరుపేదలైన అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఎర్రజెండా పోరాటాలతో పేదలకు భూములు దక్కుతాయని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

సీపీఐ వందేళ్ల ఉత్సవాల జాతీయ స్థాయి ముగింపు సభ డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుందని వారు తెలిపారు. జాతకు నాయకత్వం వహిస్తున్న సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలోని మతోన్మాదాన్ని తరిమికొట్టుటకు, సమ సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు ఏకం కావాలన్నారు.

ఈ బస్సు జాతాకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంట రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, నాయకులు లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్, సిపిఐ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి బద్రి సాయి, సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


