ఎయిమ్స్‌ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు

Published Thu, Jul 29 2021 2:36 AM

Central Govt Funding For AIIMS Master Plan Telangana - Sakshi

సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌కు మాస్టర్‌ ప్లాన్‌ మంజూరు చేసిన కేంద్రం, నిర్మాణ పనుల కోసం రూ.799 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లో ఈ నెల 23న ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీచేసింది.  ఈపీసీ పద్ధతిలో ఈ టెం డర్లను ఆహ్వానించారు. ఎయిమ్స్‌లో రూ. 776.13 కోట్లతో నూతనంగా భవనాల నిర్మాణం  చేపట్టను న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు కేటాయించిన ఖాళీ స్థలంలో కేంద్రం ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం 24 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి. అలాగే ఆపరేషన్, నిర్వహణ కోసం రూ.23.50 కోట్లు కేటాయించారు.

ఏ, బీ విభాగాలుగా పనులు విభజించి ఈనెల 23 నుంచి బిడ్‌ డాక్యుమెంట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 4 వరకు టెండర్లలో ఉన్న సందేహాలు ఈ మెయిల్‌ లేదా వెబ్‌సైట్‌ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెండర్‌ వేయడానికి ఆగస్టు 25 తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి గడువు కాగా, ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు ఈ  బిడ్‌లను తెరుస్తారు. కాగా, ఎయిమ్స్‌కు కేంద్రం నిధులు మంజూరు చేయడం పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

కిషన్‌రెడ్డి సహకారంతోనే..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతోనే బీబీనగర్‌ ఎయిమ్స్‌కు నిధులు మంజూరయ్యాయని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌ రావు చెప్పారు. ఇటీవల కిషన్‌రెడ్డి బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా మాస్టర్‌ప్లాన్‌ టెండర్లు వేస్తారన్న విషయాన్ని వెల్లడించారన్నారు.  

Advertisement
Advertisement