రేపటి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ
ఢిల్లీ వెళ్లిన అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల కోసం ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం తిరిగి మొదలు కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఘన్శ్యామ్ ఝాకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది పలు ప్రశ్నలు సంధించనున్నారు.
గత మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్కు సంబంధించిన పలు అంశాలపై ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలు లేవనెత్తగా తెలంగాణ తరఫు సాక్షి సమాధానమిచ్చారు. ప్రస్తుత విచారణలో ఇవే అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సోమవారమే ఢిల్లీ వెళ్లారు. వాదనలపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్తో వారు చర్చించనున్నారు.