-
ఔననదు.. కాదనదు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్ను జాతీయ జలమార్గం క్లాస్–3 ప్రమాణాల మేరకు నిర్మించాలని సూచించిన ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ఆ పనులకయ్యే నిధులపై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పోలవరం స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్పై దృష్టి పెట్టింది. జలాశయం పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్గా మారుతుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర నౌకాయాన శాఖ, ఐడబ్ల్యూఏఐ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆ రెండు సంస్థలు మాత్రం నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వట్లేదు. 90 శాతం పనులు పూర్తి.. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 2004–05లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు(ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీ.ల పొడవుతో అప్రోచ్ ఛానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్లు, 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్ఎస్డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్ల పనులను దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలాగే.. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. జాతీయ జల మార్గంలో స్థానం.. ధవళేశ్వరం–భద్రచాలం స్ట్రెచ్(అఖండ గోదావరి)ను జాతీయ జలమార్గం–4లో అంతర్భాగంగా 2016లో ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్ను నిర్మించాలంటే.. 1.423 కి.మీ.ల పొడవున అప్రోచ్ ఛానల్ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్ఎస్డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో 3 నావిగేషన్ లాక్లు, 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుంది. ఉలుకూపలుకు లేని ఐడబ్ల్యూఏఐ.. నిధులిస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకసార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యయాన్ని ఐడబ్ల్యూఏఐ భరించాలని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖలు కూడా స్పష్టం చేశాయి. ఐడబ్ల్యూఏఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర నౌకాయాన శాఖ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించి.. నిధులు మంజూరు చేయాలని ఐడబ్ల్యూఏఐకి తేల్చిచెప్పారు. అయినా కూడా ప్రతి సమావేశంలోనూ జాతీయ ప్రమాణాల మేరకు పోలవరం నావిగేషన్ కెనాల్ పనులు చేయాలని ఐడబ్ల్యూఏఐ ఉన్నతాధికారులు నిర్దేశిస్తారేగానీ.. నిధులిచ్చే అంశాన్ని మాత్రం ఎటూ తేల్చడం లేదు. -
నీటి దోపిడీ కోసమే పాలమూరు–రంగారెడ్డి
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అనుమతి ఇచ్చిన దానికంటే తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున పనులు చేసిందని సుప్రీం కోర్టుకు కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు నివేదించాయి. తాగునీటి అవసరాల పేరుతో భారీ ఎత్తున సాగునీటి అవసరాలకు నీటిని తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని స్పష్టం చేశాయి. 7.15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు తరలించేలా పనులు చేపట్టడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థ, 65.17 టీఎంసీలను నిల్వ చేసేలా 5 రిజర్వాయర్లను తెలంగాణ పూర్తి చేసిందని తేల్చిచెప్పాయి. ఇప్పటివరకూ పూర్తయిన పనులను పరిశీలిస్తే.. తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా చేపట్టిందని పేర్కొన్నాయి. ఆ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో దాని డీపీఆర్ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్కు తేల్చిచెప్పామని గుర్తు చేశాయి. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ నెల 2న కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల 4న జరగాల్సిన విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్కు వాయిదా వేసింది. అఫిడవిట్లో ఏం చెప్పాయంటే.. కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086.57 కోట్లతో తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఇందులో నీటిపారుదల వ్యయం రూ.50,508.88 కోట్లు, తాగునీటి విభాగం వ్యయం రూ.4,577.69 కోట్లు. ఈ ఎత్తిపోతల కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మిదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను చేపట్టింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆ జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ఎత్తిపోతల కింద తరలించే 120 టీఎంసీల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా చేపట్టలేదు. పూర్తయిన 5 రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామని తెలంగాణ సర్కార్ డీపీఆర్ను సమర్పించింది. కానీ.. ఈ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదు. నీటి కేటాయింపులపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డీపీఆర్ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్కు వెనక్కి పంపాం. నేపథ్యం ఇదీ.. చంద్రమౌళీశ్వరరెడ్డి అనే రైతు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని 2021 అక్టోబర్ 29న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్పై 2022 డిసెంబర్ 22న ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. ఆ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంపై 1.50 శాతం చొప్పున రూ.620.85 కోట్లను తెలంగాణ సర్కార్కు జరిమానా విధించింది. తెలంగాణ ఉద్దేశపుర్వకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నందున రూ.300 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.920.85 కోట్లు మూడు నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. దీనిపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ.. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతిస్తూ 2023 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్నందన్కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్హెచ్పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్హెచ్పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్హెచ్పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. -
‘పాలమూరు’ అవసరమని ప్రధానే అన్నారు
సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను 2014లో మహబూబ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రస్తావించారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుకు అనుమతులపై సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీపీవో) చీఫ్ ఇంజనీర్కు బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధాని నాడు చేసిన ప్రసంగాన్ని సైతం ప్రదర్శించింది. ఉమ్మడి ఏపీలో 2013 ఆగస్టు 8న ప్రాజెక్టు సమగ్ర సర్వే కోసం రూ. 6.91 కోట్లను విడుదల చేస్తూ జీవో నంబర్ 72 జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించింది. శ్రీశైలం జలాశయంలో అన్ని అవసరాలు పోనూ మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీల నీటి లభ్యత ఉందని రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, పాలమూరు–రంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్ హాజరయ్యారు. శ్రీశైలంలో 582.5 టీఎంసీల లభ్యత.. 75 శాతం డిపెండబులిటీ (వందేళ్లలో కచ్చితంగా వచ్చిన 75 ఏళ్ల వరద) ఆధారంగా శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో నాగార్జునసాగర్ అవసరాలకు 280 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీలు, చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, 22 టీఎంసీల ఆవిరి నష్టా లు కలుపుకుని మొత్తం 352.50 టీఎంసీలు అవసరమని, మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు అవసరమని తెలంగాణ తెలిపింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవాలని 1978 ఆగస్టు 4న బచావత్ ట్రిబ్యునల్ ముందు ఒప్పందం జరిగిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. ఈ ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాడుకోగా మిగిలిన 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించామని తెలిపింది. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ అవసరాలకు 90.81 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, 2012– 13 నుంచి 2021–22 మధ్య 45.15 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసినట్లు తెలియజేసింది. ఇలా పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ద్వారా గోదావరి జలాల తరలింపుతో లభించనున్న 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. రూ. 55 వేల కోట్లకు పెరిగిన వ్యయం.. తొలిదశలో నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, హైదరాబాద్ నగరంతోపాటు 1,226 గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టేందుకు గతంలో ఎన్జీటీ సైతం అనుమతిచ్చిందని తెలంగాణ తెలిపింది. గత ఆగస్టు 24న రెండోదశ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. 2015లో రూ. 35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా ప్రస్తుతం రూ. 55,086 కోట్లకు పెరిగిందని తెలిపింది. -
సమస్యల పరిష్కారంపై కదిలిన కేంద్రం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి ఆమోదంతోపాటు విభజన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారానికి కేంద్రం కదిలింది. ఈ సమస్యలపై చర్చించి, పరిష్కారాలను సూచించడానికి ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమంచింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రధాని చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే పలు ప్రాజెక్టులు, విభజన సమస్యలు, అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 3న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు. ఇదే అంశాలపై ఈనెల 5న ప్రధానికి సీఎం లేఖ రాశారు. తనతో జరిగిన సమావేశంలో, లేఖలో సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను అధ్యయనం చేసి, పరిష్కారానికి నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులను ప్రధాని ఆదేశించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి (వ్యయ విభాగం) అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తూ పీఎంవో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పీఎంవో డిప్యూటీ సెక్రటరీ కట్టా ఆమ్రపాలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి, ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శిలను కమిటీలో సభ్యులుగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారుల బృందంతో ఈ కమిటీ చర్చిస్తుంది. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రధాని చర్యలు తీసుకుంటారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రధానితో జరిపిన చర్చల్లో సీఎం జగన్ లేవనెత్తిన ప్రధానాంశాలు.. 1. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించాలి. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల విభాగం కింద నిధులివ్వాలి. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను మంజూరు చేయాలి. 2. రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979లు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇవే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీతోపాటు పలు హామీలిచ్చారు. వాటిని అమలు చేయాలి. 3. 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. 4. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. ఇందుకు ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాలి. ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ బిల్లులను తెలంగాణ చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి. 5. జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఏపీలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీనివల్ల భారం పడుతోంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. 6. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. 7. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్ను రెన్యువల్ చేయాలి. 8. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement