ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనపై క్షేత్ర స్థాయి పరిశీలన
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఈ నెల 25న (బుధవారం) కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు వస్తున్నారు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్(జలాశయం), కుడి, ఎడమ కాలువ పనులతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పనకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. నిర్వాసితులతో సమావేశమవుతారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ప్రాజెక్టు పనుల్లో నాణ్యత, నిర్వాసితులకు పునరావాసం కల్పనలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, సీడబ్ల్యూసీ సభ్యులు యోగేష్ పైథంకర్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి వారు నివేదిక ఇవ్వనున్నారు.


