సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వస్తున్న ఓ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్టు ఆదివారం ఉదయం అధికారులకు మొయిల్ వచ్చింది. విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలోపే ఏ క్షణమైనా పేలుడు సంభవించే అవకాశం ఉందంటూ ఆ ఆగంతకుడు మెయిల్లో పేర్కొన్నాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అందులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.
అనంతరం బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ బాంబు బెదిరింపు మెయిల్పై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


