సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయ ఘర్షణలతో యాదాద్రి భువనగిరి జిల్లా అట్టుడికింది. భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఫ్లెక్సీపై నల్లరంగు చల్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపైనా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికా?” అంటూ ప్రశ్నించారు. 60 ఏళ్ల మహిళపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
భువనగిరి ఘటనకు నిరసనగా చౌటుప్పల్లో బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ సీనియర్ నేత మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు చండూరులో మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే బీజేవైఎం కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఒకే జిల్లాలో వరుసగా దాడులు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి.

ఇదీ చదవండి: ‘ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’


