సాక్షి, హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఎన్ని సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపుతుందని, దానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకమే నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి మొదలైన తర్వాత జీరో టికెట్ల మొత్తం రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రజాభవన్లో మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వం అభినందన సభ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే, బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ వసతి పథకాన్ని ప్రారంభించిందని, దాని రూపంలో ఇప్పటి వరకు 290 కోట్ల ప్రయాణాలతో మహిళలు ఆదా చేసుకున్న మొత్తం రూ.10 వేల కోట్లకు చేరుకోగా, అంతేమొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం అందజేసి దాన్ని ఆదుకుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, వీలైతే ఈ మొత్తాన్ని రూ.లక్షన్నర కోట్లకు చేరుస్తామని ప్రకటించారు.
ఈ లక్ష్య సాధనలో సంవత్సరానికి రూ.20 వేల కోట్లు ఇచ్చే దిశలో ఇప్పటికే రూ.57 వేల కోట్లను అందజేసినట్లు వెల్లడించారు. వాటిపై ప్రభుత్వం వడ్డీ భరిస్తూ రూ.1329 కోట్లను చెల్లించిందని, తాజా బడ్జెట్లో వడ్డీ కోసం రూ.రెండున్నర వేల కోట్లను ప్రతిపాదించిందని, ఐదేళ్లలో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని భరిస్తుందని తెలిపారు. ఆరీ్టసీకి బకాయిల భారమున్నా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కారి్మక సంఘాల పునరుద్ధరణ అంశాలు తప్ప సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను కొలిక్కి తెస్తున్నట్లు వెల్లడించారు.
ఉచిత ప్రయాణ పథకాన్ని విమర్శించే వారికి, ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలే తిరుగుబాటు ద్వారా సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ సందర్భంగా ఉచిత ప్రయాణ వసతికి సంబంధించి రూ.10 వేల కోట్ల మొత్తాన్ని ఆరీ్టసీకి రీయింబర్స్ చేయడానికి గుర్తుగా రూ. 10,000 కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్, ప్రేమ్సాగర్ రావు, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సెర్ఫ్ సీఈవో దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు సీహెచ్.వెంకన్న, ఖుస్రో షా ఖాన్ , రాజశేఖర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతాకృష్ణన్ పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


