సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
పోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.
బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..
కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు.


