ప్రభుత్వ శాఖలు, సంస్థల నిధుల దుర్వినియోగానికి చెక్..
మార్చి 31తేదీకల్లా అన్ని పీడీ ఖాతాలు రద్దు
నిధుల నిర్వహణ అంతా ఇక ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే
అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు సర్కారు ఆదేశం
ఖజానాకు జమ కానున్న రూ.5 వేల కోట్లకు పైగా నిధులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంకు ఖాతా లకు ప్రభుత్వం గుడ్బై చెప్పనుంది. ప్రభుత్వ శాఖ లేదా ప్రభుత్వ రంగ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా ఇతర పద్ధతుల్లో వచ్చే నిధులు సాధారణంగా ఈ పీడీ ఖాతాలో జమ అవుతాయి. ఆ శాఖకు సంబంధించిన కార్య క్రమాలకు, ఇతర అవసరాలకు ఈ నిధి నుంచి శాఖాధిపతి నిర్ణయంతో ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని శాఖల పీడీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండడం.. ఆ నిధికి సంబంధించి వడ్డీ భారీగా జమ అవడం జరుగుతోంది.
ఈ క్రమంలో కొందరు అధికారులు వడ్డీ నిధులను వృథాగా ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని విభాగాల్లో పీడీ ఖాతాల్లోని నిధులను వ్యూహాత్మకంగా ఖర్చు చేస్తున్న తీరును సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో నిధుల వినియోగంలో పారదర్శకతకు, శాఖాధిపతులు చేస్తున్న అనవసర ఖర్చులకు చెక్ పెట్టడంతో పాటు ఇకపై ప్రతి పైసా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే జరిగేందుకు గాను పీడీ ఖాతాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ద్వారా ఇతర ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 నాటికి పీడీ ఖాతాలకు స్వస్తి పలకాలని, ఆయా ఖాతాల్లో నిల్వ ఉన్న నిధుల వివరాలను అణా పైసలతో సహా లెక్కజెప్పాలని స్పష్టం చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1నుంచి ప్రభుత్వ శాఖల ఆర్థిక వ్యవహారాలన్నీ ఆర్థిక శాఖ ద్వారానే కొనసాగాలని సూచించింది.
నిధుల వినియోగంపై ఫిర్యాదులు..
పీడీ ఖాతాల్లోని నిధులకు సంబంధించి కొన్ని విభాగాల్లో గోల్మాల్ లెక్కలున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. మరికొన్ని విభాగాలు సచివాలయంలోని ప్రభుత్వ కార్యదర్శులకు సమాచారం ఇవ్వకుండానే నిధులు వినియోగిస్తున్నాయనే ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా సంక్షేమ శాఖలు, ఆయా శాఖల పరిధిలోని కార్పొరేషన్ల పీడీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లోని ఓ కార్పొరేషన్కు చెందిన ఉన్నతాధికారి.. ఈ నిధి నుంచి, నిధికి సంబంధించిన వడ్డీ మొత్తం నుంచి గత కొంత కాలంగా వృధా ఖర్చులు చేస్తున్నారంటూ సంబంధిత కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే విధంగా వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న కార్పొరేషన్ల ఉన్నతాధికారులు వృథా ఖర్చులకు నిధులు వినియోగిస్తున్న తీరుపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకే పీడీ ఖాతాలను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. గతంలో జిల్లా స్థాయిల్లో పీడీ ఖాతాలుండేవి. అప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలోనే గత ప్రభుత్వం జిల్లా స్థాయిలో పీడీ ఖాతాలను రద్దు చేసి వాటిల్లోని నిధులను వెనక్కు తీసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల పీడీ ఖాతాలు కూడా రద్దు కానున్నాయి.
నిధులు ఖర్చు చేయొద్దు..
అన్ని శాఖలు, సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ నిధి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు చేరనుంది. ప్రస్తుతం నిధుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉంది. కాగా ఈ నిధుల నుంచి ఇక ఎలాంటి ఖర్చులు చేయొద్దని, ఆర్థిక శాఖ అను మతి లేకుండా చేసే ఖర్చులకు శాఖాధిపతి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆయా శాఖలు, సంస్థలను ఆదేశించినట్లు సమాచారం.


