Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్.. | 84th edition of Hyderabad’s Numaish to begin from January 3 | Sakshi
Sakshi News home page

Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్..

Dec 30 2024 7:19 AM | Updated on Dec 30 2024 12:39 PM

84th edition of Hyderabad’s Numaish to begin from January 3

రూ.40 నుంచి రూ.50కి పెరగనున్న ప్రవేశ రుసుము 

 జనవరి 3 నుంచి ఎగ్జిబిషన్‌  సుమారు 2 వేల స్టాళ్లు ఏర్పాటు   

వివరాలు వెల్లడించిన సొసైటీ ప్రతినిధులు  

అబిడ్స్‌: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. 

ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్‌. సురేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్‌ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కనీ్వనర్లు సురేష్‌కుమార్, సురేష్‌రాజ్‌లు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్‌ను మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సును మిని ట్రైన్‌తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 

ఎగ్జిబిషన్‌ నలుమూలలా 160 సీసీ కెమెరాలు, 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు పర్యవేక్షిస్తామన్నారు. గోల్డెన్‌జూబ్లీ బ్లాక్‌ ఎదురుగా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ ఉంట్టుందన్నారు. మినీ ట్రైన్‌ టికెట్‌ రూ.30, డబుల్‌ డెక్కర్‌ టికెట్‌ రూ.40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  

కమాండ్‌ కంట్రోల్, వైఫై టవర్‌..  
మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్‌ఫోన్ల నెట్‌వర్క్‌ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్‌లో సీనియర్‌ సిటిజన్ల కోసం వీల్‌ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్‌ డే గా, జనవరి 31వ తేదీని చి్రల్డన్స్‌ డేగా ప్రకటించినట్లు తెలిపారు.

 గత సంవత్సరం యశోధ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్‌ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్‌లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.  సమావేశంలో ఎగ్జిబిషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ గంగాధర్, హన్మంతరావు, అశ్వినిమార్గం, జీవీ రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement