యుద్ధంతో అల్లకల్లోలం..అయినా కలల సాకారం | 150 Indian students complete MBBS in Uzbekistan | Sakshi
Sakshi News home page

యుద్ధంతో అల్లకల్లోలం..అయినా కలల సాకారం

Mar 21 2025 4:30 AM | Updated on Mar 21 2025 4:30 AM

150 Indian students complete MBBS in Uzbekistan

ఉజ్బెకిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన 150 మంది భారతీయ విద్యార్థులు 

స్నాతకోత్సవానికి హాజరైన ఏఐజీ ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి 

రాయదుర్గం: రష్యా – ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో అల్లకల్లోలం సాగుతున్నా ఎంబీబీఎస్‌ విద్యార్థుల కలలు సాకారమయ్యాయి. ఉజ్బెకిస్థాన్‌లో విజయవంతంగా ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన భారతీయ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని గచి్చ»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గురువారం ఘనంగా నిర్వహించారు. 

నియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియో విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ ఏఐజీ ఆస్పత్రిలో మూడో సంవత్సరం నిర్వహించడం విశేషం. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య విద్యార్థులను తీర్చిదిద్దడంలో నియో ఖ్యాతి మరోసారి రుజువైనట్లయ్యింది.  

రష్యా –ఉక్రెయిన్‌ దేశాల మద్య యుద్ధం మొదలయ్యాక వీరందరినీ ఉక్రెయిన్‌ నుంచి ఉజ్బెకిస్థాన్‌కు తరలించారు. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో నియో విద్యార్థుల అసాధారణ విజయం ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంది. 

గ్రాడ్యుయేషన్‌లో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు ఏఐజీ ఆస్పత్రి ఆడిటోరియంలో సందడి చేశారు. అంతా ఉత్సాహంగా గడిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉజ్బెకిస్థానేలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన 150 మంది విద్యార్థుల్లో 114 మంది(76శాతం) విద్యార్థులు తమ తొలి ప్రయత్నంలోనే ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణులయ్యారు. 

డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి అవిసెన్నా అవార్డు, గౌరవ ప్రొఫెసర్‌ పదవితో సత్కారం 
ప్రపంచ వైద్య, విద్య, ఆరోగ్య సంరక్షణకు చేసిన కృషిని గుర్తిస్తూ ఏఐజీ ఆస్పత్రి వ్యవస్థాపకులు, చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి అవిసెన్నా అవార్డు, గౌరవ ప్రొఫెసర్‌ పదవితో ఆయనను సత్కరించారు. ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ఆయనను సత్కరించారు. 

అంతేకాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయ్‌బాబు గౌరవ డాక్టరేట్లు ప్రకటించగా డాక్టర్‌ సందీప్‌కు గౌరవ ప్రొఫెసర్‌ పదవిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, బుఖారా స్టేట్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిదులు, ఉజ్బెకిస్థాన్‌ రాయబార కార్యాలయ సభ్యులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement