సాక్షి, చైన్నె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 42 ఏళ్ల వ్యక్తికి ఎస్ఆర్ఎం గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన, ప్రాణరక్షణ ఛాతీ పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రమాదంలో బాధితుడి పక్కటెముకలు, రొమ్ము ఎముక (స్టెర్నమ్) విరిగిపోవడమే కాకుండా ఊపిరితిత్తులకు తీవ్ర గాయమైంది. దీంతో ఫ్లేయిల్ చెస్ట్ అనే ప్రమాదకరమైన పరిస్థితి లో పడ్డాడు. ఈ పరిస్థితిలో శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ భాగం విస్తరించడానికి బదులుగా లోపలికి కుంగిపోయి, తీవ్ర శ్వాసకోశ ఇబ్బందికి గురి చేసింది.ఈ ప్రాణాంతక గాయాలను నయం చేయడానికి ఎస్ఆర్ఎం వైద్యుల బృందం అత్యవసర ప్రాతిపదికన వీడియో–అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ సహాయంతో సర్జికల్ స్టెబిలైజేషన్ ఆఫ్ రిబ్ ఫ్రాక్చర్స్, ఛాతీ పునర్నిర్మాణ శస్త్రచికిత్సను చేపట్టింది. ఈ శస్త్రచికిత్స ద్వారా ఛాతీ గోడకు స్థిరత్వాన్ని పునరుద్ధరించడంతో బాధితుడు మళ్లీ సాధారణంగా శ్వాస తీసుకోగలిగాడు. వేగంగా కోలుకున్న అనంతరం అతడిని ఆరోగ్యకరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు.ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ విజయన్ నేతృత్వంలో డాక్టర్ అబ్దుల్ హకీమ్, డాక్టర్ విష్ణులతో కూడిన ట్రామా – అక్యూట్ కేర్ సర్జరీ బృందం టైటానియం లాకింగ్ ప్లేట్లు, స్క్రూలను ఉపయోగించి విరిగిన రొమ్ము ఎముక, పక్కటెముకలను పునర్నిర్మించింది.ఈ బృందాన్ని ఎస్ఆర్ఎం గ్లోబల్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వి. పి. చంద్రశేఖరన్ అభినందించారు.


