తమిళసినిమా: కొంచెం ఆలస్యం అవుతుందేమో గాని న్యాయం ఎప్పుడూ ఓడిపోలేదు. గెలిచే తీరుతుంది. ఇదే నటి సుకన్య విషయంలోనూ జరిగింది. పుదు నెల్లు పుదు నాత్తు చిత్రం ద్వారా 1991లో కథానాయకిగా పరిచయం అయిన నటి సుకన్య. ఆ తరువాత చిన్నకౌండర్, ఇండియన్, వాల్టర్ వెట్రివేల్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా రాణించిన ఈమె 2002లో శ్రీధర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే కొద్ది కాలానికే మనస్పర్ధలు కారణంగా భర్త నుంచి విడిపోయి వివాహ రద్దు పొందారు. కాగా ఈమె గంధపు చెక్కల స్మగ్లర్ల్ వీరప్పన్ ఒక భేటీలో చెప్పినట్లుగా జరిగిన వ్యవహారంపై ఓ ప్రైవేటు ఛానల్ చర్చా వేదికలో తన గురించి జరిగిన అసత్య ప్రచారంపై చైన్నె హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ 30 ఏళ్ల తర్వాత సుకన్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కొడుకుకు నటి సుకన్యకు అక్రమ సంబంధం ఉందని వీరప్పన్ ఒక భేటీలో పేర్కొంటున్నారు. అయితే అందులో నిజం లేదని, అది పూర్తిగా అసత్య ఆరోపణ అనీ నటి సుకన్య 1996లో చైన్నె హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆ ప్రైవేట్ ఛానల్ లో ప్రచారం చేసిన అంశాలు తన పేరుకు కళంకం వచ్చేలా ఉన్నాయ ని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె పిటీషన్ పై పలు మార్లు విచారణ జరిపిన న్యాయస్థానం 2015లో సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆమెకు నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సంబంధిత ప్రైవేట్ ఛానల్ నిర్వాహకులు చైన్నె హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన చైన్నె హైకోర్టు ప్రైవేట్ ఛానల్ పిటిషన్ను కొట్టి వేసి ఇంతకు ముందు కింది కోర్టు ఇచ్చిన తీర్పును ధృఢపరిచింది. క్రింది తీర్పు ప్రకారం నటి సుకన్య కు నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు వెంటనే చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.


