గుడిపాల: మండలంలో పిళ్లారికుప్పంలోని ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో 18 రోజులుగా నిర్వహిస్తున్న మహాభారత ఉత్సవాలు ఆదివారం దుర్యోధన వధ ఘట్టంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. తదుపరి భాగవతారిణి గీతావాణి హరికథాగానం చేశారు. అనంతరం మధ్యాహ్నం దుర్యోధన వద ఘట్టాన్ని కళాకారులు రక్తి కట్టించారు. దుర్యోధనుడు గంగ మడుగులో దాక్కుని ఉండగా.. భీమసేనుడు బయటకి లాక్కొచ్చి చేసే యుద్ధ సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి ప్రతిమ వద్ద సాగిన భీమ, దుర్యోధన వేషధారులు వధ ఘట్ట ప్రదర్శనతో ఆద్యంతమూ ప్రేక్షకులను రోమాంఛితుల్ని చేశారు. అనంతరం ధర్మరాజుల పట్టాభిషేకం, సాయంత్రం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం యడంవారిపల్లెలో జరుగుతున్న మహాభారత ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. 18 రోజులు సాగిన మహాభారత యుద్ధంలో కీలక ఘట్టమైన దుర్యోధన వధను ఆదివారం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. భీముడు–దుర్యోధనుడి మధ్య జరిగిన యుద్ధం, దుర్యోధన వధ ఘట్టాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


