ఏర్పేడు: ఏర్పేడులో వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవ్యాసాశ్రమం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శత జయంతోత్సవాలకు ముస్తాబవుతోంది. 1926లో కేరళ రాష్ట్రానికి చెందిన సద్గురు మలయాళ స్వామి ఏర్పేడులో శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పారు. శ్రీవ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆధ్వర్యంలో ఆగస్ట్ 27వ తేదీ నుంచి వారం రోజులపాటు ఆశ్రమ ప్రాంగణంలో శత జయంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో వ్యాసాశ్రమంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సద్గురు మలయాళ స్వామి అధిష్టాన మందిరం వద్ద పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలోని అన్ని భవనాలను ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అన్నదాన కేంద్రం నవీకరణ పనులు చేపడుతున్నారు. కాశీబుగ్గతీర్థం ప్రాంగణంలో చలువరాతి నిర్మాణాలు , అన్నదాన కేంద్రం సమీపంలో పార్క్ తీర్చిదిద్దారు. శ్రీవాల్మీకి మహర్షితో పాటు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మలయాళస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు.


