నిండ్ర (నగరి): నిండ్ర మండలం అత్తూరు గ్రామ పంచాయతీలోని ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల తిరునాళ్లలోభాగంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. తొలుత ఉదయం దుర్యోధన వధ ఘట్టం అనంతరం భక్తులు దేవాలయం వద్ద పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయం ఎదుట మైదానంలో అగ్ని గుండాన్ని అర్చకులు పూజల నిర్వహించి రగిలించారు. ఆ తర్వాత ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని పలు పుష్పాలతో విశేషంగా అలంకరించి గ్రామ సరిహద్దు నుంచి కంకణం ధరించిన భక్తులు గోవింద నామస్మరణతో అమ్మవారి వెంట అగ్నిగుండం వద్దకు చేరారు. సాంప్రదాయ పూజలు నిర్వహించి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. రాత్రి అమ్మవారిని పురవీధులలో ఊరేగించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరి రూరల్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో నిండ్ర, విజయపురం ఎస్ఐలు మల్లికార్జున వెంకట సుబ్బయ్య బందోబస్తు నిర్వహించారు.


