రజనీ చిత్రానికి మళ్లీ మార్పు | - | Sakshi
Sakshi News home page

రజనీ చిత్రానికి మళ్లీ మార్పు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

రజనీ చిత్రానికి మళ్లీ మార్పు

తమిళసినిమా: రజనీకాంత్‌ 173వ చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ దర్శకుల మార్పు జరుగుతూనే ఉంది. రజనీకాంత్‌ ప్రస్తుతం నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న జైలర్‌–2 చిత్రాన్ని పూర్తి చేసేశారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. దీంతో తర్వాత తన 173వ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించి చాలా కాలమైంది. ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి సుందర్‌ సి పేరును ఖరారు చేశారు. ఈయనతో చిత్ర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే అనూహ్యంగా సుందర్‌ సి చిత్రం నుంచి వైదొలిగారు.ఆ తరువాత పార్కింగ్‌ చిత్రం దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ సెట్‌ కాలేదు. ఆ తరువాత డాక్టర్‌, డాన్‌ చిత్రాల దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చడంతో ఆయన పేరు ఖరారైంది. ఈ చిత్రాన్ని కచ్చితంగా హిట్‌ చేస్తానని సిబి చక్రవర్తి ఒక వేదికపై చాలా నమ్మకంగా చెప్పారు. అలాంటిది ఆ తరువాత ఆయన పేరు మారిన వారి లిస్ట్‌లో చేరిపోయింది. తాజాగా ఓమై కడవులే, డ్రాగన్‌ చిత్రాల ఫేమ్‌ అశ్వద్‌ మారిముత్తు పేరు వినిపిస్తోంది. అంతే కాదు ఈయన ఫిక్స్‌ అనే. ప్రచారం జరుగుతోంది. ఇందులో దర్శకుడు మిష్కిన్‌ ఒక కీలక పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయాన్ని యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. కథ నచ్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుంది అని కమలహాసన్‌ ఇంతకుముందే పేర్కొన్నారు అన్నది గమనార్హం.

అశ్వద్‌ మారిముత్తు, రజనీకాంత్‌

Advertisement
 
Advertisement
Advertisement