తమిళసినిమా: యూకే స్క్వాడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం టెక్సాస్ టైగర్. ఫ్యామిలీ పడం చిత్రం ఫేమ్ సెల్వ కుమార్ తిరుమారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో డ్యూడ్ చిత్రం ఫేమ్ హిరుదు హరూన్, సంయుక్త విశ్వనాథన్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు సెల్వకుమార్ తిరుమారన్ తెలుపుతూ ఎంటర్టెయిన్మెంట్, భావోద్రేకాలతో కూడిన సన్నివేశాలు, ఆసక్తికరమైన అంశాలతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ పొందిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన ఈ మ్యూజిక్ సంస్థ తమ చిత్రం ఆడియో హక్కులను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఎంతో అంకితభావంతో శ్రమించిన చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి, ఆడియోకు ప్రపంచ ప్రేక్షకుల అందించే ఆదరణను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్ర ఆడియో, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు.


