తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కవిత హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా తండలం గ్రామంలో సుమారు రూ.17.20 కోట్లు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు, కూవం నదిలో రూ.5.98 కోట్లు వ్యయంతో ఆనకట్ట పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ కవిత అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యత, వేగాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్లకు నిర్ణయించిన వ్యవధిలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతను అధికారులు తరచూ పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కడంబత్తూరు యూనియన్ సత్తరై గ్రామంలో 14.5 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణపు పనులను సైతం కలెక్టర్ పరిశీలించి వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.


