సాక్షి, చైన్నె : రవాణా శాఖలో ఉద్యోగాల స్కాం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మా జీ మంత్రి సెంథిల్ బాలాజీపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అనుమ తి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆర్.వి. అర్లేకర్కు అధికారికంగా ఫైలును సమర్పించి ఉండటం శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 2011 నుండి 2016 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో డ్రైవర్, కండక్టర్, ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కోట్ల రూపాయల లంచాలు తీసుకుని మోసం చేశారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఆ తదుపరి ఆయన డీఎంకేలో చేరడం, మంత్రి కావడం జరిగాయి. ఈ కేసులో 2023 జూన్లో ఈడీ ఆయనను అరెస్ట్ చేయగా, సుదీర్ఘ జైలు శిక్ష తర్వాత 2024 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలో మంత్రి పదవిని సైతం కోల్పోయారు.
ప్రభుత్వ అనుమతి..
సెంథిల్ బాలాజీ ఆరోపణల సమయంలో మంత్రిగా ఉన్నందున, పీఎంఎల్ఏ చట్టం కింద విచారణను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమని గత డీఎంకే ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో, ఈడీ అధికారులు పిటిషన్ కాపీలు, రహస్య పత్రాలు , పెన్ డ్రైవ్ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించడం గమనార్హం.
సీఎం విజయ్ ఆమోదం – గవర్నర్కు ఫైల్
ఈ కేసును పునః దర్యాప్తు చేయడానికి కొత్త సీఎం సి. జోసెఫ్ విజయ్ ఇప్పటికే తన ఆమోదాన్ని తెలపడంతో, దర్యాప్తు అనుమతికి సంబంధించిన ఫైలును లోక్ భవన్కు పంపించి ఉండటం శనివారం వెలుగులోకి వచ్చింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మంత్రులు, మాజీ మంత్రులపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం చట్టరీత్యా గవర్నర్కు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని, ఆయన సంతకం చేసిన వెంటనే అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.


