తిరువళ్లూరు: జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్మాక్ దుకాణాలను మూసివేయడంతో ఆంధ్రకు వెళ్లి కల్తీ మద్యం తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారని వా పోయిన మహిళలు మూసేసిన టాస్మాక్ దుకాణాన్ని మళ్లీ ప్రారంభించాలని కోరారు. కలెక్టర్ కవితను కలిసి గురువారం వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పళ్లవాడలో తమిళనాడు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల క్రితం టాస్మాక్ దుకాణ ం ఏర్పాటు చేసింది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 717 దుకాణాలను తొలగించాలని జీఓ ఇచ్చిన నేపథ్యంలో పల్లవాడలో దుకాణాలను తొలగించారు. దీంతో పలు గ్రామాలకు చెందిన మద్యం ప్రియలు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సత్యవేడు, ఆరూరు, తడ ప్రాంతాలకు వెళ్లి అక్కడ విక్రయించే నకిలీ మద్యం తాగి అనారోగ్యానికి గురువుతున్నారని వాపోయారు. అదే విధంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఆంధ్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేస్తున్నారు, ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని కలెక్టర్ కవిత వద్ద వాపోయారు. తమ గ్రామంలో మూసేసిన టాస్మాక్ దుకాణాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. మహిళ నుంచి వచ్చిన వినతిపై కలెక్టర్ కవిత నవ్వుతూ, మహిళలు ఇంతక ముందు మద్యం దుకాణాలను మూసేయాలని కోరేవారని, ప్రస్తుతం దుకాణాలు కావాలని కోరడం ఆశ్చర్యంగా వుందన్నారు. తొలగించిన మద్యం దుకాణాలను మళ్లీతెరిచే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.


