వాడవాడలా డీఎంకే సేనల సేవా కార్యక్రమాలు
సమాధి వద్ద స్టాలిన్తో పాటూ
నేతల అంజలి
కరుణానిధి సమాధి వద్ద స్టాలిన్ పుష్పాంజలి
సాక్షి, చైన్నె: దివంగత డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి జయంతిని పురస్కరించుకుని టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ నేతృత్వంలో అధికారిక కార్యక్రమంగా నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఓమందూర్ ఎస్టేట్లోని కరుణానిధి విగ్రహానికి మంత్రి రాజ్ మోహన్ అధికారులు నివాళులర్పించారు. గత ఐదు సంవత్సరంగాలు అధికారంలో ఉన్న డీఎంకే తాజాగా ప్రతి పక్షంలో ఉన్నప్పటికీ కరుణానిధి జయంతి విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా వాడవాడలా 103 వ జయంతి కార్యక్రమాలు హోరెత్తాయి. కరుణానిధి చిత్ర పటాలు, విగ్రహాలకు నేతలు నివాళులర్పించారు. ఆయన ప్రసంగాలను హోరెత్తించారు. ఇందులో ప్రదానంగా చివరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం శ్రమిస్తా.. అన్న కరుణానిధి ప్రసంగాల వీడియోలను వైరల్ చేశారు. సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లారు.
అన్భగంలో వేడుక
డీఎంకే యువజన విభాగం కార్యాలయం అన్భగంకు చాలా కాలం తర్వాత స్టాలిన్ వెళ్లారు. ఇక్కడ అన్నా, కరుణానిధి విగ్రహాలను ఆవిష్కరించారు. 75 అడుగుల స్తూపంలో పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చాలా సేపు గడిపి, యువజన నేతలతో మాట్లాడారు. అనంతరం ఆయన ఎక్స్ పేజిలో కరుణానిధి జయంతి సందర్భంగా కేడర్కు ఓ సందేశాన్ని ఇచ్చారు.
చక్రాల కుర్చీలో నుంచే..
‘నాయకుడి పుట్టినరోజు! చక్రాల కుర్చీలోనే ఉంటూ తమిళ జాతిని నడిపించిన మహోన్నత నాయకుడు జయంతి రోజు ఇది’ అని స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. వృద్ధాప్యం పైబడినప్పటికీ, తన చివరి శ్వాస వరకు తమిళ జాతి అభ్యున్నతి కోసం, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ‘విజయాలూ.. అపజయాలూ మనల్ని ఆపలేవు అని పేర్కొంటూ, ‘ప్రియమైన నాయకుడా.. కళాకారుడా.. విజయాన్ని తలకెక్కించుకోకుండా, అపజయాన్ని హృదయానికి హత్తుకోకుండా, కష్టాల సముద్రాలను అలసట లేకుండా ఈదగల మానసిక బలాన్ని మీరే మాకు అందించారు. ఆ బలం ఇప్పుడు నాలోనూ ఉంది.’ అని వివరించారు. ‘ మీరు మాతో ఉన్నప్పుడు మీ శక్తితో నిరంతర విజయాలు సాధించి, తమిళనాడును చరిత్ర కీర్తించే ప్రగతి పథంలో తీర్చిదిద్దారని, ప్రస్తుతం మనం గెలిచే అవకాశాన్ని కోల్పోయి ఉండవచ్చు. అయినప్పటికీ, తమరు ఇచ్చిన స్ఫూర్తి కేవలం నాతోనే కాదు.. మీరు పెంచి పోషించిన కోట్ల మంది డీఎంకే తోబుట్టువుల గుండెల్లో సజీవంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ‘ఉదయించే సూర్యుడి’ కాంతితో ప్రకాశిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
సమాధి వద్ద అంజలి
కలైంజ్ఞర్ కరుణానిధి జయంతి సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన ప్రతి పక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఉదయాన్నే మెరీనా తీరానికి చేరుకున్నారు. కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం తరలి వచ్చిన కరుణానిధి, ఆ పక్కనే ఉన్న అన్నాదురై సమాధి వద్దకూడా నివాళులర్పించారు. అనంతరం ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని కరుణానిధి విగ్రహానికి స్టాలిన్ నివాళులర్పించారు. అక్కడి నుంచి డీఎంకే కార్యాలయం ఆ వరణలోని అన్నా, కరుణానిధి విగ్రహాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ముందుగా గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఆయన చిత్ర పటానికి అంజలి ఘటించారు. అలాగే, ఆళ్వార్ పేట సీఐటీ కాలనీలోని కరుణానిధి మరో సతీమణి రాజాత్తి అమ్మల్ ఇంటికి వెళ్లారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కరుణ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
కరుణానిధి జయంతి సందర్భంగా స్టాలిన్ సందేశం
ఆయన పాత్ర కీలకం : సీఎం విజయ్
దివంగత కరుణానిధికి నివాళులర్పిస్తూ సీఎం విజయ్ సందేశాన్ని విడుదల చేశారు. తమిళ భాష, సాహిత్యం, సినిమా, రాజకీయాలు, రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కరుణానిధి అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన చేసిన అపారమైన కృషిని, అందించిన భాగస్వామ్యాన్ని స్మరించుకుంటున్నానని పేర్కొన్నారు.


