
కమలనాథుల్లో జోష్!
న్యూస్రీల్
రాష్ట్రంలో 23వ తేదీ వరకు కొనసాగనున్న వర్షం
కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈనెల 23 వతేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చైన్నె వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ గాలుల వేగంలో మార్పు కారణంగా, సోమవారం నుండి ఆగస్టు 23 వరకు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల, అలాగే పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఒకటి , రెండు చోట్ల, ఉపరితల గాలులు గంటకు 50 కి.మీ వేగంతో వీచవచ్చు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదిలి సోమవారం (ఆగస్టు 18) అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడు తీరప్రాంతాలు, మన్నార్ గల్ఫ్, కుమారి సముద్రం, బంగాళాఖాతంలో సోమవారం, మంగళవారం (ఆగస్టు 18 , 19) రెండు రోజుల పాటూ గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు ఆ ప్రాంతాలలో చేపలు పట్టవద్దని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది డీఎస్పీల బదిలీ
కొరుక్కుపేట: రాష్ట్రవ్యాప్తంగా 12 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ శంకర్ జివాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుప్పూర్ నగర క్రైమ్ కమిషనర్గా ఉన్న చెంగ్ కుట్టువన్ను చైన్నె మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు, చైన్నెలోని సీఐడీలోని నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్లో డీఎస్పీగా ఉన్న రాగవిని చైన్నె మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. నాగపట్నం జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ సెంథిల్ను చైన్నె మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు, తిరువల్లూరు జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీగా ఉన్న మణిమేగలైయన్ను ఈఐఏ బ్రాంచ్కు, చైన్నె మెట్రోపాలిటన్ వెస్ట్ ట్రైనింగ్ సెంటర్గా ఉన్న మును స్వామిని చైన్నె మెట్రోపాలిటన్ ఈస్ట్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్కు, చైన్నె ఎకనామిక్ క్రైమ్ బ్రాంచ్ హెడ్క్వార్టర్స్ డీఎస్పీగా ఉన్న పొన్రాజ్ను చైన్నె మెట్రోపాలిటన్ ఈస్ట్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. ఇలాగే పలువురి డీఎస్పీలను బదిలీ చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కమలనాథులలో జోష్ నెలకొంది. పార్టీ కోసం శ్రమించే వారందరికీ అధిష్టానం తప్పకుండా ఏదో ఒక రోజు గుర్తింపు ఇస్తుందన్న భావనలో పడ్డారు. అదే సమయంలో త్వరలో రాష్ట్రానికి చెందిన మరో నేతకు గవర్నర్ పదవి దక్కబోతుందన్న సమాచారం బీజేపీ వర్గాలలో మరింత ఉత్సాహాన్ని నింపినట్లయ్యింది.
సాక్షి, చైన్నె: తమిళనాట పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు పెద్దపీట వేస్తున్నామని చాటే విధంగా ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో పార్టీలోనే కాదు, వివిధ పదవులలోనూ స్థానం కల్పిస్తున్నారు. ఇది వరకు రాష్ట్రానికి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఎన్నికలలో పోటీ చేయాలన్న కాంక్షతో ఆ పదవికి రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత ఇలగణేషన్ను గవర్నర్గా నియమించారు. నాగాలాండ్ గవర్నర్గా వ్యవహరిస్తున్న సమయంలో రెండు రోజుల క్రితం ఆయన కన్నుమూశారు. ఇక, రాష్ట్రానికి చెందిన ఎల్మురుగన్కు ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయమంత్రి ఎన్డీఏ 1, 2లలో సైతం దక్కాయి. అలాగే సీపీ రాధాకృష్ణన్కు తొలుత గవర్నర్ పదవి దక్కడం, తాజా పరిణామాల అత్యుత్తమంగా ఉప రాష్ట్రపతి పదవి సైతం దక్కనున్నడం తమను కూడా అందలం ఎక్కించే విధంగా అధిష్టానం ఏదో ఒక రోజు గుర్తింపు ఇస్తుందన్న ఆశాభావంతో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుకుని ఎన్నికలలో పనిచేయడానికి రాష్ట్రంలోని కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు.
కార్యకర్త నుంచి..
తిరుప్పూర్లో రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్ ద్వారా తన రాజకీయ ప్రయనాన్ని కొనసాగించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999లో రెండు సార్లు కోయంబత్తూరులోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ మెట్లు ఎక్కారు. 2014,2019 ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలలో నామినెటెడ్ పదవుల్లో కొనసాగారు. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అంటే సీపీరాధాకృష్ణన్, సీపీఆర్ అంటే బీజేపీ అన్నట్టుగా రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. తన కన్నా జూనియర్లు అనేక మంది రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లినా, తనకు కూడా ఏదో ఒక రోజు మంచి అవకాశం దక్కక పోదా? అని ఎదురు చూశారు. ఎట్టకేలకు సీపీఆర్ గవర్నర్ ఛాన్స్ దక్కింది. చివరకు ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి పదవి సైతం ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్రం ఎంపిక చేయడం సీపీఆర్ మద్దతు దారుల్లోనే కాదు, తమిళనాడులోని సీనియర్లుగా, పదవుల కోసం ఎదురు చూస్తున్న కమలనాథులలోనూ ఆనందం, జోష్ నిండుకుంది.
డీఎంకే దారి ఎటో..
తమిళనాడుకు చెందిన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టడంలో గతంలో డీఎంకే కీలక పాత్రనే పోషించింది. రెండో సారి ఆయనకు అవకాశం కల్పించే ప్రయత్నాలు సాగినా, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో కలాం సున్నితంగా తిరస్కరించారు. ఈ పరిస్థితులో తమిళనాడుకు చెందిన సీపీఆర్కు ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కింది. ఇది తమిళనాడుకు గర్వకారణమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ , రామస్వామి వెంకటరామన్లు ఒకప్పుడు తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతులు అయ్యారు. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ పదవికి తమిళనాడుకు చెందిన సీపీఆర్ను బీజేపీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయడం తమిళనాట రాజకీయంగాను చర్చకు దారి తీసింది. తమిళనాట పాగా వేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపి, అన్నాడీఎంకే కూటమి, తాజాగా డీఎంకే కూటమిని ఇరకాటంలో పెట్టేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీఎం స్టాలిన్తో సీపీఆర్కు స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. గత వారం సీఎంతో పరామర్శ భేటీ అనంతరం ముంబైకు సీపీఆర్ వెళ్లారు. ఈ పరిస్థితులో సీపీఆర్ విషయంలో డీఎంకే అడుగులు ఎలా ఉంటాయో అన్న ఎదురు చూపులు తమిళనాట పెరిగాయి. అదే సమయంలో సీపీఆర్కు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీఎం స్టాలిన్తో పోన్లో మాట్లాడినట్టు సమాచారాలు వెలువడ్డాయి. రాజ్నాథ్ సింగ్ సీఎం స్టాలిన్కు సన్నిహిత నేత అన్న విషయం గమనార్హం.
సర్వత్రా ఆనందం
తమిళనాడు నుంచి బీజేపీకి చెందిన నేతగా తొలిసారిగా ఉప రాష్ట్రపతి పదవిని సీపీఆర్ అధిరోహించి తీరుతారన్న నమ్మకాన్ని ఆయన మద్దతు దారులే కాదు, బీజేపీలోని ప్రతి ఒక్కరూ హర్షం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అయితే, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సీపీఆర్ గెలుపునకు తమిళనాడులోని అందరు ఎంపీలు పార్టీలకు అతీతంగా ఓట్లు వేయాలని కోరారు. పీఎంకే నేత అన్బుమణి స్పందిస్తూ, ఉప రాష్ట్ర పతి పదవికి సీపీఆర్ అర్హుడు అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలందరూ సీపీఆర్ గెలుపు ఖాయం అన్న ధీమాతో ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆనందానికి అవధులు లేదని చెప్పవచ్చు. ఆయనతో పాటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సైతం రాష్ట్రంలోని ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని పిలుపు నివ్వడం విశేషం.
మరో నేతకు గవర్నర్ పదవి..
తమిళనాడుకు చెందిన ముగ్గురు బీజేపీ నేతలు ఇది వరకు గవర్నర్లుగా వ్యవహరించారు. వీరిలో తమిళి సై రాజీనామా చేయగా, ఇలగణేషన్ కాన రాని లోకాలకు వెళ్లారు. తాజాగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ ఎంపిక కావడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేయక తప్పదు. దీంతో రెండు రాష్ట్రాలకు గవర్నర్ పదవులు ఖాళీ కానున్నాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాలలో గవర్నర్ల పదవీకాలం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితులో తమిళనాడుకు చెందిన ఓ నేతకు గవర్నర్ పదవి దక్కబోతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్ రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించి ఉన్నారు. మరో నేత హెచ్ రాజ పార్టీ పదవులతో సరి, జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు దక్కే ఓ పదవి కోసం ఎ దురు చూస్తున్నారు. ఈసారి రాజాకు గవర్నర్ పదవి దక్కేందుకు అవకాశం అధికంగా ఉన్నట్టు బీజేపీలో చర్చ మొదలు కావడం గమనార్హం.

కమలనాథుల్లో జోష్!