
బ్రహ్మాండోత్సవం
● ‘మీనాక్షి’ అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు ● ధ్వజారోహణంతో ప్రారంభం ● నిఘా వలయంలో మదురై ● నగరం అంతా పండుగ శోభ
ధ్వజ స్తంభానికి పూజలు నిర్వహిస్తున్న శివాచార్యులు (ఇన్సెట్) విహరిస్తున్న మీనాక్షి అమ్మవారు, శివపార్వతులు
సాక్షి, చైన్నె: ఆథ్యాత్మిక నగరం మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహోత్సవ వైభవం మంగళవారం ప్రారంభమైంది. నగరం అంతా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొత్త శోభ సంతరించుకుంది. ఉదయం శివాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగిన పూజాది కార్యక్రమాలతో ఽబ్రహ్మోత్సవాలకు ధ్వజారోహనం జరిగింది. ఈసందర్భంగా శివనామస్మరణతో మదురై తిరువీధులు మారుమోగాయి. వివరాలు.. మదురై పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువు దీరి ఉన్నది సాక్షాత్తూ ఆ పార్వతీ దేవి అవతారమే. పురాణాల మేరకు మదురై పాలకుడు మలయ ధ్వజ పాండ్య చేసిన ఘోర తప్పస్సుకు మెచ్చి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదకు పార్వతీ దేవి అడుగు పెడుతారు. పెరిగి పెద్దయిన ఆమెను వివాహం చేసుకునేందుకు సుందరేశ్వరుడిగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. భూమ్మీద జరిగిన ఈ వివాహ ఘట్టానికి సమస్తలోకాలు తరలి వచ్చినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఇక్కడ ఏడాది పొడవున ఉత్సవాలు జరిగినా, చిత్తిరై ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. తమిళనాడు నుంచే కాదు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు మదురై వైపుగా పోటెత్తుతారు. అందుకే ఆథ్యాత్మిక నగరం మదురై నగరంలో పండుగ శోభ సంతరించుకునే విధంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేశారు.
ధ్వజారోహణం..
ధ్వజారోహమంతో మంగళవారం బ్రహ్మోత్సవాలకు చుట్టారు. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారిని వేర్వేరుగా బంగారు సింహాసనంలో అధిష్టింప చేసి ఆలయం ఆవరణలో ధ్వజ స్థంబం వద్దకు తీసుకొచ్చారు. స్వామి, అమ్మవార్లు అక్కడ ఆశీనులు కాగా, శివాచార్యుల నేతృత్వంలో 56 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు ధ్వజస్తంభం వద్ద విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. 12 రోజుల పాటూ వైభవోపేతంగా జరిగే చిత్తిరై బ్రహ్మోత్సవాలకు శాస్రోక్తంగా పూజలతో శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం జరిగింది. ఈ సమయంలో భక్తులు శివనామ శ్మరణను మార్మోగించారు. సరిగ్గా 10.35 గంటల సమయంలో బంగారు ధ్వజస్థంబపై చిత్తిరై ఉత్సవ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను సప్త వర్ణ పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో శోభాయ మానంగా తీర్చిదిద్దారు.
రోజుకో ప్రత్యేక ఉత్సవం..
బ్రహోత్సవ వైభవంలో రోజూ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. రోజూ మాసి వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ధ్వజారోహణం తర్వాత మంగళవారం కల్పవృక్షం, సింహ వాహన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టాలు మే 6వ తేదీ నుంచి కనుల పండువగా జరుగుతాయి. 6వ తేదీన అమ్మవారి పట్టాభిషేకం, 7వ తేదీన దిగ్విజయం, 8వ తేదిన ఉదయం 8.35–8.50 గంటల మధ్య మీనాక్షి, సుందరేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం, 9వ తేది రథోత్సవం, 10వ తేదీన తీర్థవారి కార్యక్రమాలు జరగనున్నాయి. మే 12వ తేదీన కళ్లలగర్ స్వామి వారి వైగై నదీ ప్రవేశ ఉత్సవం జరగనుంది. చిత్తిరై ఉత్సవాలతో మదురైలో పండుగ శోభ సంతరించుకుంది. నగరం అంతా విద్యుత్ దీపకాంతుల మయం చేశారు. పెద్దఎత్తున భక్తులు తరలి రానున్నడంతో మదురై ఆథ్మాత్మిక వాతావరణంలో పులకించనుంది. మదురై వైపుగా ఆ పరిసరా జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేలాది మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మదురై, విరుదునగర్, రామనాథపురం జిల్లాలకు చెందిన పోలీసులను భద్రతా విధుల్లో నియమించారు.

బ్రహ్మాండోత్సవం