
లక్ష మందికి ఇంటి పట్టాలు
● నిబంధనల సడలింపు ● వార్షిక ఆదాయం రూ. 5 లక్షలుగా నిర్ణయం
సాక్షి, చైన్నె: ప్రభుత్వ పోరంబోకు, ఆక్షేపణకరంగా ఉండే స్థలాలలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేయనుంది. లక్షల మందికి ఇంటి పట్టాల పంపిణీ దిశగా వార్షిక ఆదాయంలో మార్పుచేస్తూ ఆదివారం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. వివరాలు.. చైన్నె, శివారులోని కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలను ఒక బెల్టుగా ప్రభుత్వం ఇటీవల పరిగణించిన విషయం తెలిసిందే. 32 కి.మీ దూరంలోని ఈ బెల్టు పరిధిలో ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, ఆక్షేపణ కర స్థలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఏళ్ల తరబడి ఉన్న వారికి ఇంటి పట్టా పంపిణీకి ఫిబ్రవరిలో జరిగిన మంత్రి వర్గం భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇంటి పట్టాలు లేక ఏదేని రుణాలు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలు లేకుండా ఇబ్బందిపడుతున్న ఈ స్థలాలలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరికి భరోసా ఇస్తూ సీఎం స్టాలిన్ ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా ఈ బెల్టు పరిధిలోనే కాదు, ఇతర జిల్లాలోనూ నివసించే వారికి ఇంటి పట్టాల పంపిణీకి సిద్ధమయ్యారు. చైన్నెలో సుమారు 29 వేల గృహాలు, ఇతర ప్రాంతాలలో మరో 57 వేల గృహాలు ఉన్నట్టు గుర్తించారు. వీరందరికి ఇంటి పట్టా పంపిణీకి సిద్ధమయ్యారు. అయితే ఇంటిపట్టా కోసం దరఖాస్తు చేసుకునే వారి వార్షిక ఆదాయం రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. దీంతో అనేక మందికి ఇబ్బందులు తప్పలేదు. దీనిని పరిగణించిన సీఎం స్టాలిన్ ఈనెల 17వ తేదీన జరిగిన మంత్రి వర్గం భేటిలో మార్గదర్శకాల రూపకల్పన,చట్ట సవరణకు నిర్ణయించారు.
3 సెంట్ల వరకు స్థలం
చట్ట సవరణతో కొత్తగా సిద్ధం చేసిన మార్గదర్శకాలను ఆదివారం రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఆ మేరకు 10 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాల పంపిణీకి సిద్ధమయ్యారు. ఒకొక్కరికి మూడు సెంట్ల భూమికి సంబంధించి పట్టా ఇవ్వనున్నారు. ఆ మేరకు వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈవార్షిక ఆదాయం కలిగిన వారు ఇంటి పట్టాకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే 2 సెంట్ల భూమికి ఎలాంటి రుసుం వసూలు చేయరు. మిగిలిన ఒక సెంట్కు మాత్రం స్థల విలువలో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం 5 నుంచి 12 లక్షలలోపు ఉన్న వారు అయితే, 2 సెంట్ల భూమికి స్థల విలువలో 50 శాతం, మరో సెంట్ భూమికి స్థల విలువలో వంద శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. 12 లక్షలకు పైగా ఆదాయం పొందే వారు 3 సెంట్లభూమికి స్థల విలువలో 100 శాతం ఫీజు చెల్లించే విధంగా మార్గదర్శకాలను సిద్ధంచేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వర్తిసుందని ప్రకటించారు.