కమనీయం.. కల్యాణోత్సవం | Sakshi
Sakshi News home page

కమనీయం.. కల్యాణోత్సవం

Published Mon, Nov 20 2023 12:40 AM

పళణి: విశేష అలంకరణలో స్వామి అమ్మవార్లు  - Sakshi

● రాష్ట్రవ్యాప్తంగా సందషష్టి వేడుకలు ● మురుగన్‌ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఇందిరా గాంధీకి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో వళ్లి, దేవానై సమేతంగా మురుగన్‌కు కల్యాణం నిర్వహించారు. వివరాలు.. రాష్ట్రంలో తమిళ్‌ కడవుల్‌గా మురుగన్‌ను భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడే ఆయనకు ఆరుపడై వీడులుగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో జయంతి నాథర్‌ స్వామి ఆలయం, దిండుగల్‌ జిల్లా పళణిలోని దండాయుధపాణి, మదురై తిరుప్పరగుండ్రం సుబ్రమణ్యస్వామి, తంజావూరు జిల్లా స్వామి మలైలోని స్వామినాథ స్వామి ఆలయం, మదురై పళముదిర్‌ చోళైలో సోలై మలై మురుగన్‌, తిరుత్తణిలో మురుగన్‌ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో ఈనెల 13వ తేదీ నుంచి వీటిలో స్కంధషష్టి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య ఘట్టం సూర సంహారం శనివారం సాయంత్రం జరిగింది. మరో ముఖ్య వేడుక ఆదివారం జరిగింది. స్వామి వారి కల్యాణోత్సవ ఘట్టాన్ని తిలకించేందుకు తిరుచెందూరు, పళణితి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. పళణి కొండపై కల్యాణ మహోత్సవం ఉదయం కనుల పండువగా జరిగింది. వళ్లి, దేవయాణి సమేత దండాయుధ పాణి స్వామి వారికి ఆలయంలో విశిష్ట పూజలు , అభిషేకాలు జరిగాయి. ఆలయం ఆవరణలోని మండపంలో భక్తులు హరోహర నామస్మరణ నడుమ కల్యాణ వేడుక జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు విందును సైతం ఏర్పాటు చేశారు. తిరుచెందూరులో కల్యాణ మహోత్సవం అద్వితీయంగా సాగింది. ఈ సందర్భంగా వేకువ జాము నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు స్వామి అమ్మవార్లకు జరిగాయి. దేవయాణి అమ్మవారు ఆలయం నుంచి తపస్సుమండపంకు చేరుకుని మధ్యాహ్నం వరకు భక్తులను కటాక్షించారు. అనంతరం అక్కడకు చేరుకున్న స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక్కడ స్వామి , అమ్మవార్లకు మాల ధారణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయ వీధులలో జరిగిన ఊరేగింపుగా స్వామి అమ్మవార్లు భక్తులను కటాక్షించారు. రాత్రి రాజగోపురం మండపంలో స్వామి అమ్మవారి కల్యాణ ఘట్టం వేలాది మంది భక్తల జయ జయ ద్వానాల నడుమ కమనీయంగా సాగింది.

కొరుక్కుపేటలో..

కొరుక్కుపేట: చైన్నె పాత చాకలిపేట, బసవయ్యన్‌ వీధిలో వెలసిన శ్రీ కపిల వినాయక దేవస్థానంలో శ్రీ వళ్లి దేవసేనా సమేత శ్రీ శివసుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం ఆదివారం కనులపండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుత్తణిలో ముగిసిన వేడుకలు

తిరుత్తణి: స్కందషష్టి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మురుగన్‌ కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి, ఆలయ ధర్మపాలక మండలి చైర్మన్‌ శ్రీధరన్‌, ట్రస్టుబోర్డు సభ్యులు సురేష్‌బాబు, నాగన్‌, మోహనన్‌, ఉషా తదితరులు స్వామికి పట్టువస్త్రాలు, పండ్లు, పూజాసామగ్రి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ సమర్పించారు. అనంతరం అర్చకుల బృందం మురుగన్‌ కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఇందులో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవం తిలకించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు మహిళలకు కుంకుమ ప్రసాదాలు పంపిణీ చేశారు. దీంతో ఆరు రోజుల పాటు నిర్వహించిన స్కందషష్టి ఉత్సవాలు ముగిశాయి.

Advertisement
Advertisement