విషం తాగి దంపతుల ఆత్మహత్య
●కుమారుడి పరిస్థితి విషమం
అన్నానగర్: విల్లుపురం జిల్లా కందమంగళం యూనియన్లోని శేషంగనూర్ పంచాయతీ పరిధిలోని కురంపాలయం గ్రామానికి చెందిన కార్తికేయన్ (85). ఇతని భార్య చంద్ర (71). వీరి కుమారుడు విజయన్ (46). ఇతని భార్య సత్య, వీరికి వసంత్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ స్థితిలో సత్య తన భర్త నుండి విభేదాల కారణంగా విడిపోయింది. దీని తరువాత, మానసికంగా బాధపడుతున్న విజయన్ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. దీని కారణంగా కుటుంబాన్ని, అతని కొడుకును పోషించడానికి అతని వద్ద తగినంత డబ్బు లేదు. దీంతో సోమవారం ఉదయం ఎవరూ ఇంటి నుండి బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చింది. వారు ఇంటికి వెళ్లి చూడగా కార్తికేయన్, చంద్రలు చనిపోయి ఉన్నారు. కుమారుడు విజయన్ను రక్షించి పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
శ్రీరంగంలో కొనసాగుతున్న పగల్ పత్తు ఉత్సవం
తిరువొత్తియూరు: తిరుచ్చి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పగల్ పత్తు 3వ రోజున సోమవారం సౌరి కొండై అలంకారంలో నంబెరుమాళ్ అర్జున మండపంలో కొలువుదీరారు. భక్తులు పెద్దఎత్తున దర్శనం చేసుకున్నారు. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ప్రధానమైనది, భూలోక వైకుంఠం అని భక్తులు కొనియాడే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు గత 19వ తేదీన ప్రారంభమయ్యాయి. 20వ తేదీ నుంచి పగల్ పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. పగల్ పత్తు ఉత్సవాల్లో 3వ రోజు సోమ వారం వైభవంగా జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం సోమ వారం ఉదయం మూలస్థానం నుంచి నంబెరుమాళ్ అర్జున మండపంలో అజంతా సౌరిక్ కొండై అలంకరణలో పల్లకిలో తిరువీధి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అర్జున మండపంలో ఆళ్వార్ల సమక్షంలో కొలువుదీరి భక్తులకు సేవ సాగించారు. నంబెరుమాళ్ను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. పగల్ పత్తు చివరి రోజున వచ్చే 29వ తేదీన నంబెరుమాళ్ మోహిని అలంకారంలో దర్శనమిస్తారు. అనంతరం రాపత్తు ఉత్సవాల్లో మొదటి రోజున 30వ తేదీన ముఖ్య ఘట్టమైన ఉత్తర ద్వారం తెరుచుకోనుంది.
ఫూణే గ్రాండ్ టూర్ ట్రోఫీ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: సైక్లింగ్ రోడ్ రేస్ వైపుగా తొలి అడుగు వేస్తూ ప్రతిష్టాత్మక బజాజ్ ఫూణే గ్రాండ్ టూర్ 2026 ట్రోఫిని సోమవారం చైన్నెలో ఆవిష్కరించారు. తమిళనాడు క్రీడల శాఖ కార్యదర్శిఅతుల్య మిశ్ర, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డిలు ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. మహారాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో బజాజ్ ఫుణే గ్రాండ్ టూర్ 2026 పేరిట అంతర్జాతీయ సైక్లింగ్ ఈవెంట్ రోడ్ రేస్కు వివిధ ప్రాంతాల నుంచి సైకిలిస్టులను ఆహ్వానించే విధంగా ఐఏఎస్ అధికారి జితేంద్ర నేతృత్వంలో కార్యక్రమాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ట్రోఫీ టూర్లో భాగంగా చైన్నెలో పూణే గ్రాండ్ టూర్ ట్రోఫి ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో బజాజ్ పూణే గ్రాండ్ టూర్ రేస్ టెక్నికల్ డైరెక్టర్ పినాకి బైసాక్, సైకిల్ రేసింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు.
చైన్నెలో పెరుగుతున్న వంధ్యత్వం కేసులు
సాక్షి, చైన్నె: చైన్నెలో మగవారిలో వంధ్యత్వం సమస్యతో కూడిన కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు వైద్యుల పరిశీలనలో అపోలో ఫెర్టిలిటీ, నోవా ఐవీఎస్, మదర్ హుడ్ హాస్పిటల్స్ వైద్యులు నగరంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం స్థానికంగా వివరాలను ప్రకటించారు. చైన్నె అన్నానగర్లోని అపోలో ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, తమ వద్దకు వచ్చేరోగులలో స్పెర్మ్పారామితులలో స్థిరమైన క్షీణను గుర్తించామని వివరించారు. ఒక సంవత్సరం కాలంలో 350 నుంచి 400 మంది పురుషులు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. వీరిలో ఎక్కువగా 25 నుంచి 40 సంవత్సరాల వారే ఉన్నారని వివరించారు.నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ జె. కృతికా దేవి పేర్కొంటూ, వంధ్యత్వానికి కారణాలను విశదీకరిస్తూ, వాసెక్టమి రివర్సల్, టీఈఎస్ఏ, పీఈఎస్ఏ వంటి చికిత్సా పద్దతులను వివరించారు. మదర్ హుడ్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ డి.మహేశ్వరి మాట్లాడుతూ, రోజు వారీగా వ్యాయమం పురుషులుకు తప్పని సరిగా పేర్కొన్నారు. ఆహారంలో ఆరోగ్యకరమైన పండ్లు, ఫలాలు, కాయగూరులు తప్పనిసరి అని తెలిపారు. జంక్ ఫుడ్, అధిక చక్కెర ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.


