కూవాగంలో హిజ్రాల సందడి..

హొయలు పోతున్న హిజ్రాలు  - Sakshi

సాక్షి, చైన్నె: కూవాగంలో హిజ్రాల సందడి నెలకొంది. మిస్‌ కూవాగం పోటీలు హోరాహోరీగా మొదలయ్యాయి. మంగళవారం హిజ్రాల పెళ్లి సందడి ప్రారంభం కానుంది. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్‌ హిజ్రాలకు ఆరాధ్యుడనే విషయం తెలిసిందే. ఈ ఆలయంలో గత నెలాఖరు నుంచి చైత్రమాసం(చిత్తిరై) ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి అత్యంత వేడుకగా మంగళవారం జరగనుంది.

ఈ వేడుకల కోసం హిజ్రాలు కూవాగం వైపుగా పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు తరలి వస్తున్నారు. ఫలితంగా విల్లుపురం, ఉలందూరు పేట పరిసరాల్లోని లాడ్జీలు గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా నిండిపోయాయి. అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని హిజ్రాలు రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో వారిని చూసేందుకు యువకులు ఎగబడుతున్నారు.

సోమవారం స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో జరిగిన మిస్‌ కూవాగం పోటీలలో సేలంకు చెందిన ప్రతీశివం, చైన్నెకు చెందిన వైషు, తూత్తుకుడికి చెందిన బ్యూలాలు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. సాయంత్రం నుంచి ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్ముడి, ఉదయ నిధి స్టాలిన్‌ , సినీ నటి వరలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. ఇక, హిజ్రాల పెళ్లి సందడి మహోత్సవం కోసం కూవాగం గ్రామం ముస్తాబైంది.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top