సూర్యాపేటటౌన్ : గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, దానిని బయటకు వెల్లడించడం చట్టరిత్యా నేరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో రేడియాలజిస్టులు, వైద్యులు, స్కానింగ్ కేంద్రాల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీసీపీఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పించారు. రేడియాలజిస్ట్లు, వైద్యులు, స్కానింగ్ కేంద్రాల యాజమాన్యాలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే ఆల్ట్రా సౌండ్ పరీక్షకు సంబంధించిన ఫామ్ ఎఫ్ రికార్డులను నమోదు చేయడంతో పాటు భద్రపర్చాలన్నారు. స్కానింగ్ కేంద్రంలో అవసరమైన నోటీసులు, బోర్డులను ప్రదర్శించడం, రెన్యూవల్ నిబంధనలు వంటి వాటిపై వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు నాజియా తబస్సుం, శ్రీశైలం, బాసిత్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నీట్ లాంగ్ టర్మ్
శిక్షణకు దరఖాస్తులు
నడిగూడెం : సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీట్ లాంగ్ టర్మ్ శిక్షణకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 22 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్. పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని టీజీఎస్డబ్ల్యూ, ఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణకు చిలుకూరులో 100 మంది బాలురకు, మహీంద్ర హిల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది బాలికలకు శిక్షణను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
నూతనకల్ : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై ముఖ్యంగా నీటి కాలుష్యంతో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్ శిరీష, సీహెచ్ఓ శరణ్నాయక్, దయామణి, ప్రసాద్, మాధవరెడ్డి, ప్రియాంక ఉన్నారు.
విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్కు జాతీయ అవార్డు
పాలకవీడు : కళారంగంలో విశేష సేవలతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినందుకు గాను పాలకవీడు మండల కేంద్రంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గుంటి పిచ్చయ్యకు ‘భారతీయ కళారత్న – ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు–2026’ వరించింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని ఎన్టీఆర్ కళావేదికలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మంత్రి జూపల్లి ఆయనను ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు. పిచ్చయ్యను సంస్థ సిబ్బంది, అధికారులు అభినందించారు.


