సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ హెచ్చరించారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అల్ట్రాసౌండ్ కేంద్రాలు, జన్యు క్లినిక్లు, ఇమేజింగ్ సెంటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశంలో వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ కోటి రత్నం, ప్రసిద్, నాజియా, శ్రీశైలం, ఇరుగు కోటేశ్వరి, బాసిత్, సంజీవ్రెడ్డి, ఉమామహేశ్వరి, సుధాకర్ పాల్గొన్నారు.
విద్యార్థులకు
అవుట్ రీచ్ ప్రోగ్రాం
సూర్యాపేటటౌన్ : ఆదాయ పన్ను దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో కామర్స్ విద్యార్థులకు అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆదాయపు పన్ను అధికారులు నిశాంత్ గోయల్, ఎం.ప్రసాద్ మాట్లాడుతూ.. ఆదాయ పన్ను సకాలంలో చెల్లించడం, ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులో ఐటీఆర్ రికార్డులను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ వెంకటేశులు, మారుతి బాలాజీ, వాణిజ్య శాస్త్ర హెచ్ఓడీ చక్రవర్తి, అధ్యాపకులు అనిల్ పాల్గొన్నారు .
విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు కృషి
పెన్పహాడ్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు డీసీఓ శ్రీరామ్ తెలిపారు. గురువారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నారాయణగూడెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు 750మంది రైతులు సభ్యులుగా ఉండాలని ప్రస్తుతం 373మంది సభ్యులు మాత్రమే ఉన్నారని మిగతా రైతులను సభ్యులుగా చేర్చుకున్న వెంటనే అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సీఈవో సైదులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.


