వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి సుప్రబాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణతంతు పూర్తిచేసి శ్రీస్వామిఅమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ముందస్తుగా శుక్రవారం రాత్రి ఆలయానికి చేరుకుని వివిధ సత్రాల్లో బసచేశారు. తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, సాయిగౌతమ్చార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.


