గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..
● సింహ వాహనంపై ఊరేగిన యాదగిరీశుడు ● నేడు ఎదుర్కోలు ఉత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయంలో నిత్య కై ంకర్యాలు పూర్తిచేసి యాగశాలలో హవన పూజలు జరిపించారు. అనంతరం స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ప్రధానాలయం తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ అలంకార సేవను ఆలయ తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణాలు, వేద మంత్రాలు పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సాయంత్రం సింహ వాహనంపై..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో అర్చకులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణం పఠించి, స్వామి విశిష్టతను వివరించారు.
ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ
మంగళ, బుధవారాల్లో ఎదుర్కోలు మహోత్సవం, తిరు కల్యాణోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు, తూర్పు మాడ, తిరు వీధులను యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు సోమవారం రాత్రి ఆలయాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు కల్గకుండా తీసుకోవాల్సిన అంశాలను కొండపైన ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్తో ఆయన చర్చించారు.
కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్వామి వారి అలంకార సేవ ముందు వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు కళాకారులు కోలాటం, నృత్యాలు చేశారు. దశావతార వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్వాన్లోని విశ్వాంజనేయ భక్త సమాజం, మైలార్గూడెంలోని జై శ్రీరామ భక్త భజన మండలి, భూదాన్ పోచంపల్లికి చెందిన మార్కండేశ్వరస్వామి భజన మండలి, రంగారెడ్డికి చెందిన అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో భజన, భక్తి సంగీత కార్యక్రమాలు కొనసాగాయి. ఆస్థానపరంగా మంగళవాయిద్యం, వైధిక ప్రార్థన జరిపించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ మానస చెన్నప్ప నవవిధ భక్తితత్త్వములు, ప్రహ్లాదుని భక్తిపై ఉపన్యసించారు. పురాణం విజయలక్ష్మి రుక్మిణి కల్యాణం, హరికథా గానం చేశారు. మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్ వాయిద్యం, హైదరాబాద్లోని మంజుల డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం వేళ కచ్చపి కళా క్షేత్రం భక్తి సంగీతం, హైదరాబాద్కు చెందిన భరద్వాజ నాట్యాలయం కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన, లావణ్య లత భక్తి సంగీతం, ఓలేటి రంగమణి సింహనందిని నృత్యం, హరిప్రియ భక్తి సంగీతం కార్యక్రమాలు కొనసాగాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
మంగళవారం ఉదయం స్వామివారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారిని ఊరేగించి ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. ఆలయ తూర్పు మాడ వీధిలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..
గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..
గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..


