ప్రత్యేక ఆకర్షణగా డోలు, సన్నాయి కళాకారులు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డోలు, సన్నాయి కళాకారులు వాయించే మంగళ వాయిద్యాల శబ్ధం భక్తులకు ఆధ్యాత్మిక భావంలోకి తీసుకెళ్తున్నాయి. ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు ప్రతిరోజు దేవుడి సేవలో డోలు, సన్నాయి కళాకారులు పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో సైతం పూజలు, ఉదయం, రాత్రి జరిగే అలంకార సేవ, వాహన సేవలో ఈ డోలు, సన్నాయి బృందం సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సన్నాయిలో నుంచి వచ్చే సంగీతానికి తగినట్లుగా డోలు వాయిస్తుంటే ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.
భక్తి భావాన్ని పెరుగుతుంది
స్వామికి సంప్రదాయ పద్ధతిలో మంగళకరమైన వాయిద్యాన్ని మోగిస్తుంటే భక్తి భావం పెరుగుతుంది. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రత్యేక రోజుల్లో ఏఏ పాటలను సన్నాయిలో నుంచి తీసుకురావాలనే అంశాన్ని ఆలోచిస్తాం. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే కచ్చితంగా ప్రతిరోజు ఏ సేవ ఉంటుందో ఆ సేవకు తగిన పాటను సన్నాయిలో నుంచి తీసుకురావడం ఎంతో సంతోషాన్నిస్తుంది.
– తిరుపతయ్య, సన్నాయి కళాకారుడు
స్వామి సేవకు అంకితమయ్యాను
గత 16 ఏళ్లుగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సేవకు అంకితమయ్యాను. దేవుడికి ఆలపించే పాటకు తగ్గట్లుగా డోలు వాయించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. బ్రహ్మోత్సవాలు వస్తే ఆలయానికి వచ్చే భక్తులకు భక్తిని పెంపొందించే విధంగా మా సభ్యులమంతా కృషి చేస్తున్నాం. డోలు వాయిస్తున్నంత సేపు మేము కూడా ఆ స్వామిని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక లోకంలో ముగినిపోతాం.
– రాము తిరుపాలి, డోలు కళాకారుడు
ప్రత్యేక ఆకర్షణగా డోలు, సన్నాయి కళాకారులు
ప్రత్యేక ఆకర్షణగా డోలు, సన్నాయి కళాకారులు


