నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి
నల్లగొండ టౌన్ : కర్ల రాజేష్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఈ కేసు విచారణ అధికారి, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేయకపోవడం వల్లే కర్ల రాజేష్ మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐని అరెస్ట్ చేయకుండా ఈ కేసుతో సంబంధం లేని సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో అడ్డగూడూరు లాకప్ డెత్ జరిగినప్పుడు ఎస్ఐని సస్పెండ్ చేసిన పోలీసులు చిలుకూరులో మాత్రం సీఐని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 26న బీబీనగర్ ఎయిమ్స్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెండు నెలల క్రితమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రీపోస్టుమార్టంకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అది జరగలేదన్నారు. ఇప్పటికై నా న్యాయబద్ధంగా రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా నరసింహ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తరి ఏడుకొండలు, నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోలి జనార్దన్గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ


