తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారం,
రూ.లక్ష నగదు అపహరణ
దేవరకొండ: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండభీమనపల్లి గ్రామానికి బొడ్డుపల్లి శంకరయ్య ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు శంకరయ్య ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం శంకరయ్య హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పోలీసులు నమోదు చేసి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు.
అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో సోమవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దురాజ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లబండ కాలనీకి చెందిన పల్లపు రాజు(35) వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతడు ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ వి. మహేశ్వర్ను వివరణ కోరగా తమకు ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.


