కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు
మునగాల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణగూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణగూడెంలో అగ్ర వర్ణాలకు చెందిన వారు మాలలపై విపరీతంగా దాడి చేశారన్నారు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా శాయంపేటలో మాలబిడ్డపై దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండించి ఆ బిడ్డకు న్యాయం చేకూర్చినట్లు తెలిపారు. కారంచెడు, చుండూరు, ఈ మధ్య మరియమ్మపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి వారికి న్యాయం చేసేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాడిందన్నారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసలతో మృతిచెందితే దానిని తీవ్రంగా ఖండించడంతో పాటు దోషులను శిక్షించాలని నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంఘటితమై పోరాడాలని పిలుపు నిచ్చారు. గడ్డం లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ ఏపూరి రాజుమాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకొట్ల నాగరాజు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, రాష్ట్ర నాయకుడు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, మండలాధ్యక్షుడు లంజేపల్లి శ్రీనుమాదిగ, సంఘం మండలాధ్యక్షుడు గుడిపాటి కనయ్య మాదిగ, మిట్టగణుపుల వీరబాబు తదితరులపాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


