ప్రజల పక్షాన కళాకారుల పోరాటం
అర్వపల్లి : కళాకారులు పీడిత ప్రజల పక్షాన గళం విప్పాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 9వ జిల్లా మహాసభలు నిర్వహించారు. సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజాకళాకారులు ఉద్యమించాలన్నారు. కళ కాసులకోసం కాదని, ప్రజల కోసమని చాటి చెబుతూ పోరాడుతున్న క్రమంలో అనేక మంది కళాకారులు నిర్భందాలను ఎదుర్కొన్నారని, ఈ పోరాటంలో మరెందరో అమరులయ్యారని తెలిపారు. అంతకు ముందు అర్వపల్లి వై జంక్షన్ నుంచి ఫంక్షన్హాల్ వరకు కళాకారులు వివిధ కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుణోదయ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, నాయకులు తడకమల్ల సంజీవ్, ఎర్ర ఉమేశ్, బొల్లి వెంకన్న, గుండు నగేశ్, తదితరులు పాల్గొన్నారు.


