పట్టణ పాలకులు
సూర్యాపేటటౌన్ : మున్సిపాలిటీల నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లు బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కాగా.. కోదాడ, సూర్యాపేట, హుజుర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నికయ్యారు. ఉదయం 11గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభంకాగా.. క్యాంపుల నుంచి కౌన్సిలర్లు ప్రత్యేక బస్సుల్లో మున్సిపల్ కార్యాలయాలకు చేరుకున్నారు. వారు రాగానే మున్సిపల్ ప్రత్యేక అధికారి సభ్యులచే ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకొని వారితో ప్రమాణం స్వీకారం చేయించడంతో చివరి ఘట్టం ముగిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఒక సభ్యుడు ప్రతిపాదించగా, మరొక సభ్యుడు బలపరిచిన అనంతరం సభ్యులతో చేతులు ఎత్తించగా మెజార్టీ ఎవరికి ఉందో వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా అధికారులు ప్రకటించారు.
నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే..
సూర్యాపేట మున్సిపాలిటీల్లో మొరిశెట్టి నివేదిత చైర్ పర్సన్గా ఎన్నిక కాగా.. వైస్ చైర్మన్గా ఎండీ.షఫీఉల్లాను ఎన్నుకున్నారు. అలాగే హుజూర్ మున్సిపల్ చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్గా తన్నీరు మల్లికార్జునరావు ఎన్నుకున్నారు. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన్న వెంకటరెడ్డిని ఎన్నుకోగా, వైస్ చైర్మన్గా నూకల సందీప్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా సంకేపల్లి రఘునందన్రెడ్డిని, వైస్ చైర్మన్గా ఎల్సోజు గోవిందమ్మ.. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్గా ఎర్నేని కుసుమకుమారి, వైస్ చైర్పర్సన్గా దేవరపల్లి మల్లీశ్వరిలను సభ్యులు ఎన్నుకున్నారు.
ఎక్స్అఫీషియో అవసరం లేకుండానే..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకున్న నాలుగు మున్సిపాలిటీలకు స్పష్టమైన మెజార్టీ రాగా తిరుమలగిరిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుడి అవసరం లేకుండానే ఎన్నిక జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను కాంగ్రెస్కు 31వార్డులు వచ్చాయి. అలాగే కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డుల్లో 26 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా హుజుర్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 19 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. అలాగే నేరేడుచర్లలో 15వార్డులకుగాను తొమ్మిది వార్డులు కాంగ్రెస్ గెలుచుకోగా తిరుమలగిరి మున్సిపాలిటీలో 15వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్ కై వసం చేసుకుంది.
సందడిగా మున్సిపల్ కార్యాలయాలు
సుమారు సంవత్సరం తర్వాత మళ్లీ నూతన పాలకవర్గాలతో మున్సిపల్ కార్యాలయాలు సందడిగా మారాయి. సంవత్సరం పైగా పత్యేకాధికారుల పాలన కొనసాగింది. పాలకవర్గాలు లేక కళతప్పిన మున్సిపల్ కార్యాలయాలు నూతన పాలకవర్గాలతో సందడిగా మారాయి. మూడు నెలలకోసారి మున్సిపల్ప్రత్యేక సమావేశాలు జరగడంతో పాటు ప్రజా సమస్యలపై ఇక గళమెత్తనున్నారు.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్లే..
ఫ తిరుమలగిరిలో బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక
ఫ కౌన్సిలర్లు క్యాంపుల నుంచి
నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు
ఫ ఉదయం 11గంటలకు
ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు
ఫ మధ్యాహ్నం 12.30గంటలకు చైర్మన్,
వైస్ చైర్మన్ల ఎన్నిక
ఫ కొత్త పాలవర్గాలతో మున్సిపల్
కార్యాలయాల్లో సందడి


