లక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీదుల్లో ఊరేగించారు. పార్వతీ రామలింగేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ నిరుద్యోగ యువతకు హార్డ్వేర్, నెట్వర్కింగ్ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ యువకులు అర్హత పత్రాలతో దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో గానీ, భూమిరెడ్డి హాస్పిటల్ పక్కన గల విన్సోల్ ఎడ్యూకేషన్ సొసైటీలో గానీ ఈ నెల 21లోగా అందించాలని సూచించారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా మైనారిటీ ఆఫీస్లో లేదా మొబైల్ నంబర్ 9492611057, 9666499929ను సంప్రదించాలని కోరారు.
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
సూర్యాపేటటౌన్ : కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ అన్నారు. జిల్లాలో మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ సోమవారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న అగ్రవర్ణాలు, కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో బీసీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తగుళ్ల జనార్దన్, చిన్న శ్రీశైలం, రామ్యాదవ్, బయ్యా రాజేశ్, శంకర్, గణేశ్ పాల్గొన్నారు.
యాదగిరీశుడి
ప్రధానాలయం శుద్ధి
యాదగిరిగుట్ట : ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధానాలయాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు, సిబ్బంది శుద్ధి చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేందుకు తక్కువ సమయం ఉన్నందున సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ సమయంలో భక్తులకు శ్రీస్వామి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గర్భాలయంతో పాటు ఉప ఆలయాలు, ముఖ మండపం, క్యూలైన్లు, ఆలయ ప్రథమ ప్రాకార మండపాలను సిబ్బంది శుద్ధి చేశారు. అంతకు ముందు గర్భాలయంలోని స్వయంభూలకు ఈఓ భవానీ శంకర్, ప్రధానార్చకులు సురేంద్రచార్యులకు సింధూర లేపనాన్ని అందజేశారు.
లక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణం
లక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణం


