కర్ల రాజేష్ కుటుంబానికి అండగా ఉంటాం
కోదాడ: కోదాడలో ఇటీవల రిమాండ్లో ఉండగా మృతిచెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబానికి అండగా ఉంటామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రాజేష్ ఇంటికి అడిషనల్ డీజీపీ డీఎస్ చౌహాన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి వెళ్లి రాజేష్ తల్లిని పరామర్శించారు. అక్కడే ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆయనకు రాజేష్ మృతికి గల కారణాలను వివరించారు. పోలీసుల వల్లే రాజేష్ మృతిచెందాడని తాను అన్ని ఆధారాలతో డీఎస్పీ నుంచి డీజీపీ వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంద కృష్ణమాదిగ ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీపై రాంచందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే తాత్కాలిక పింఛన్ మంజూరు పత్రాన్ని రాజేష్ తల్లి లలితమ్మకు అందించారు.
చార్జిషీట్ దాఖలు చేయాలి..
ఈ కేసులో 10 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు. కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజేష్ మృతికి కారణమైన అప్పటి చిలుకూరు ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డీజీ డీఎస్ చౌహన్కు చెప్పామన్నారు. కర్ల రాజేష్ తల్లికి మూడు రోజుల్లో ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కలెక్టర్ అంగీకరించారని, రెండు నెలల్లో ఆమెకు మూడెకరాల భూమిని కూడా మంజూరు చేయాని కలెక్టర్ను ఆదేశించామన్నారు. 10 రోజుల్లో రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. కమిషన్ ఆదేశాలను అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్


