రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలి
దేవరకొండ : ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. సోమవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన బీసీ సభకు ఆయన హాజరై మాట్లాడారు. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లు, బీసీ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలను విడుదల చేయడంతో పాటు వారి సంక్షేమానికి కొత్త పథకాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్లను ఆయన శాలువాలతో సత్కరించారు. అనంతరం ఇటీవల విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం–దాని పర్యవసనాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆ సంఘం నాయకులు అరుణ్కుమార్, వరికుప్పల శ్రీను, వెంకటయ్య, ఏరుకొండ రాము, భాస్కరాచారి, శివగౌడ్, జయలక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య


